KTR Thanks To Chandrababu and YS Jagan:


హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మాజీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై శాస‌న‌స‌భ‌లో చేప‌ట్టిన స్వ‌ల్ప కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదని, ఇవ్వాళ తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చు అని చంద్రబాబు అన్నారు. ఈ విషయం తాను టీవీలో చూశానని చెప్పారు. హైదరాబాద్ లో కాదు తెలంగాణలో అక్కడి ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉందని, మెడ మీద కత్తి పెట్టినా వాళ్లు మీటర్లు పెట్టడం లేదని చంద్రబాబు అనడం వాస్తవం కాదా అన్నారు. తెలంగాణలో మంచి జరిగిందని చెప్పిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.


ఇదే అంశంపై మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సైతం కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో సుస్థిరత, పటిష్ట శాంతి భద్రతలను ఏపీ సీఎం జగన్ మెచ్చుకున్నారు. దిశా కేసులో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరుకు ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్ కు సెల్యూట్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. మన రాష్ట్రం బాగు పడిందని, అభివృద్ధి చెందిందని పొరుగు రాష్ట్రం సీఎం, ప్రతిపక్ష నేతలకు అర్థమైంది కానీ, రాష్ట్ర నేతలు భట్టి విక్రమార్కకు, రఘునందన్ రావుకు మాత్రం అర్థం కావడం లేదన్నారు. శ్రీధర్ బాబుకు, ఈటల రాజేందర్ లకు సొంత రాష్ట్రం ముందుకు పోతుంటే మెచ్చుకునే ఓపిక కూడా లేదంటూ ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పాము - మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, Expiry Date దాటిపోయిన మెడిసిన్ అని చచ్చిపోయిన పాములాంటిదన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ కోరలు తీసేశారని, కానీ వాళ్లు ఏదో ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పక్కింట్లో పెళ్లిఅయితే ఇంట్లో హడావుడిలాగ.. కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను చూసి తెలంగాణలో ఆ పార్టీ నేతలు హంగామా చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఏదో జరిగిందని చూసి, భట్టి, శ్రీధర్ రెడ్డి మరికొందరు నేతలు తమకు పదవులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సీతక్క సీఎం అని ఒకాయన చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే సీతక్క సీఎం ఏంది, ఇది పెద్ద జోక్ అన్నారని గుర్తుచేశారు. 


కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత 2004లోనే పోయిందన్నారు. రాష్ట్రం ఇస్తామని చెప్పి మోసం చేశారు కనుక ఆరోజే వీళ్ల అడ్రస్ గల్లంతయింది. అందుకే ప్రజలు వీళ్లను తోమి తోమి పక్కన కూర్చోబెట్టారు. ఎందుకంటే ఎన్నో వందల ప్రాణాలు పోయాయి అందుకు ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. వీళ్లు మరోసారి ప్రజల విశ్వసనీయత పొందే అవకాశమే లేదంటూ కాంగ్రెస్ నేతలపై అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలోనే ఐక్యత ఉండదని, వాళ్లు 4 కోట్ల మందిని పాలించడం అసాధ్యమన్నారు.