Kishan Reddy on CM KCR: హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో హోంగార్డు రవీందర్ ను ఆయన ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ... హోంగార్డు వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. అలాగే హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రతికూల పరిస్థితుల్లో వారు విధులు నిర్వర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో ప్రత్యేక అలవెన్సులు కూడా ఇవ్వాలని సూచించారు. హోంగార్డులను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.