తెలంగాణ(Telangana) ప్రజలు కేసీఆర్(KCR) పాలనపట్ల విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవడం.... బీజేపీ(BJP) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్(TRS) అవినీతి పాలన ఎండగడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న ప్రజా సంగ్రామ యాత్ర(Praja Sangram Yatra) చేస్తున్న బండి సంజయ్‌కు(Banmdi Sanjay Kumar) మద్దతు పలకాలని కోరారు. 


జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal) జిల్లాలో రెండోరోజు పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇమాంపేట నుంచి లింగన్ వాయి మీదుగా బూడిదపాడు సెంటర్, ఉండవల్లి వరకు నడిచారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna)సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు పాదయాత్రలో నడిచారు. అనంతరం లింగన్ వాయి గ్రామంలో ప్రజల గోస-బీజేపీ భరోసా(Prajala Gosa BJP Bharosa) పేరిట నిర్వహించిన రచ్చబండలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 







కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తోందని వివరించారు కిషన్ రెడ్డి. గ్రామాల్లోని పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించడంతోపాటు ఔషధాలు ఇస్తోందన్నారు. 


నరేంద్ర మోదీ(Modi) నాయకత్వంలో గ్రామాభివృద్ధి కోసం ఠంచనుగా నిధులిస్తోందని.. గ్రామంలో రోడ్లకు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం పనులు అన్ని కేంద్రం ఇస్తున్న నిధులతోనే పని చేస్తున్నాయన్నారు కిషన్‌రెడ్డి. పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు, గ్రామాలకు దూరంగా జీవనం సాగిస్తున్న పేదలకు ఉచితంగా కరెంటు, ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు కేంద్రమే ఇస్తోందన్నారు. 







పేద ప్రజలకు అండగా ఉండాలని సంవత్సరానికి రూ. 5లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొస్తే దానికి  కేసీఆర్ సర్కారు మోకాలడ్డుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం సమగ్రమైన పంట బీమా పథకం తీసుకొస్తే దాన్నీ అడ్డకుంటున్నారన్నారు. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం అవి పేదలకు అందకుండా చేశారని విమర్శించారు. తెలంగాణలో పావలా వడ్డీ రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని.. దీనికి కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. 


కౌలు రైతులకు రైతుబంధు రావడం లేదన్న కిషన్ రెడ్డి... కౌలు రైతులను మోదీ ప్రభుత్వం డబ్బులిస్తున్నా కేసీఆర్ అడ్డుకుంటున్నారన్నారు. కేసీఆర్ మాటలు ప్రగతి భవన్ దాటడం లేదని విమర్శించారు. పెండింగ్ పనులు ముందుకు సాగాలంటే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం రావాలని ప్రజలకు తెలిపారు. 


నిజాయితీ పార్టీ రావాలన్నా, ప్రజాస్వామ్య పాలన రావాలన్నా... కుటుంబ, నిజాం నియంతృత్వ పాలన పోవాలన్నారు కిషన్‌ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా సహా ప్రతి జిల్లా సశ్యశ్యామలం కావాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సిందేనన్నారు. బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ యాత్రకు అందరు కలిసి రవాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అవినీతిరహిత పాలనను అందుకోవాలన్నారు. కేసీఆర్ నియంతృత్వ, అచారక, కుటుంబ పాలన పోవడం ఖాయం బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 


బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. కేసీఆర్ ఎన్ని విష ప్రచారాలు చేసినా అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని జోష్యం చెప్పారు. చాలా మందిని నియంతలను చూశామని... కేసీఆర్ సహా ఏదీ శాశ్వతం కాదన్నారు కిషన్ రెడ్డి. 


తెలంగాణలో ఇష్టారాజ్య పాలన జరుగుతోందని... లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియాతో దోచుకుంటున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. అవినీతి మచ్చలేకుండా నరేంద్రమోదీ పాలిస్తుంటే...  ఏనాడూ ఆఫీస్‌కు రాకుండా పాలిస్తున్న నేత కేసీఆర్‌ అన్నారు. సెక్రటేరియట్ లేని రాష్ట్రం తెలంగాణేయే అన్నారు. 


కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి. అందుకే కేసీఆర్ బయటకొచ్చి తిరుగుతున్నారని విమర్శించారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని చెబుతున్నారని... అయితే 2024లో ఈ దేశానికి ప్రధాని అయ్యేది మళ్లీ నరేంద్రమోదీ మాత్రమేనన్నారు కిషన్ రెడ్డి.