ఖైరతాబాద్‌లో ఈ ఏడాది ప్రతిష్ఠించిన మహా రుద్రగణపతి విగ్రహ నిమజ్జనం పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో భారీ విగ్రహాన్ని క్రేన్ల సాయంతో నిమజ్జనం చేశారు. క్రేన్ నెంబరు 4 వద్ద మహా గణపతి నిమజ్జనం జరిగింది. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ట్యాంక్ బండ్‌కు పోటెత్తారు. ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం జరుగుతుండగా పక్కనే ఉన్న భక్తులు పోటీ పడుతూ గణపయ్యతో సెల్ఫీలు దిగారు. ఈ భారీ గణపతి విగ్రహ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా వేలాది మంది భక్తులు కళ్లార్పకుండా తిలకించారు.


పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ఆదివారం ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైంది. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర సందడిగా సాగింది. ట్యాంక్‌ బండ్‌పై తుది పూజల అనంతరం మహా గణపతి నిమజ్జనం కోసం తరలింది. నిమజ్జనం కోసం ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన 4వ నెంబరు క్రేన్‌‌‌ను కేటాయించారు. చివరి రోజు మహా గణపతి దర్శనం కోసం ట్యాంక్ బండ్‌కు భారీగా భక్తులు తరలివచ్చారు. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చిన సంగతి తెలిసిందే.


ట్యాంక్ బండ్‌పైనే 600 మంది పోలీసులు
నవరాత్రుల పూజలందుకున్న వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. ఇందుకోసం ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. గతంలో 27 క్రేన్‌లను ఏర్పాటు చేయగా, ఈసారి గణనాథుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాటిని కుదించారు. ఆదివారం జరిగే సామూహిక నిమజ్జనాన్ని పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఒక్క ట్యాంక్‌బండ్‌పైనే బందోబస్తు కోసం 600 మంది పోలీసులను మోహరించారు. రెండు క్రేన్లకు ఒక సీఐ, ప్రతి క్రేన్‌కు ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు సిబ్బంది నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.


ప్రశాంతంగా నిమజ్జనం
గణేష్ నిమజ్జనం కోసం పోలీసులు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా సీసీటీవీ కెమెరాలను అనుసంధానం చేసి వాటి ద్వారా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది పోలీసులను నిమజ్జనం కోసం ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. అలాగే, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి సహాయ సహకారాలతో.. పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లుగా డీజీపీ చెప్పారు.


వచ్చే ఏడాది నుంచి మహా గణపతి శోభాయాత్ర లేనట్లే..
ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేయాలని భాగ్య నగర్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కమిటీ భావిస్తోంది. వచ్చే ఏడాది నుండి పూర్తిగా మట్టి వినాయకుడినే తయారు చేయించాలని కూడా కమిటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని తయారు చేయాలని.. విగ్రహాన్ని అదే స్థానంలో నీటిని వేగంతో చిమ్ముతూ అక్కడికక్కడే నిమజ్జనం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ ఒక్కసారికి అనుమతులు తెచ్చుకుంది.