Srinivas Goud: తెలంగాణ ఎక్సైజ్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయడం కోసం జరిగిన కుట్ర వ్యవహారం కొద్ది నెలల క్రితం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సైబరాబాద్‌ సీపీ సహా 18 మందికి మహబూబ్‌ నగర్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మహబూబ్‌ నగర్‌ కోర్టులో రాజు, పుష్పలత పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని రాజు తెలిపారు. తన ఇంట్లో సీసీటీవీ, హర్డ్‌ డిస్క్‌లను దొంగించారని రాజు పిటిషన్‌లో చెప్పారు. సాక్షిగా ఉన్న తన భర్త విశ్వనాథ్‌ను కిడ్నాప్‌ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. హత్యకు కుట్ర కేసులో​ గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌ బయటకొచ్చాక మహబూబ్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


గత మార్చి నెలలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ను హత్య చేయడం కోసం కుట్ర కేసు వెలుగులోకి వచ్చింది. మంత్రి తనను ఆర్థికంగా దెబ్బతీశారనే కోపంతో హత్యకు పథకం వేశామని రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్య కుట్ర వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు భద్రత పెంచింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల హత్య కుట్ర కోణం బయట పడటంతో రెండు పైలట్‌ వాహనాలు, 20 మందితో మంత్రికి భద్రత కల్పించాలని సెక్యూరిటీ వింగ్ అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌(Remand Report)లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 


తనను ఆర్థికంగా దెబ్బతీసినందుకు మంత్రి హత్యకు ప్లాన్ చేసినట్లు నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన వ్యాపారాలను మూసివేయించారని, ఆర్థికంగా దెబ్బతీశారని రాఘవేంద్రరాజు పోలీసులు తెలిపారు. 


బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ 
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల్ని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల పాటు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును వేర్వేరు కోణాల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు మాత్రం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తమను వేధించారని పోలీసులకు వెల్లడించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏ1 రాఘవేంద్రరాజు తాను ఎందుకు హత్య చేయాలనుకున్నాడో పోలీసులకు వివరించాడు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఉన్న నిందితులు మున్నూరు రవి, యాదయ్య కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బాధితులమేనని పోలీసులకు వెల్లడించారు. నిందితులకు, శ్రీనివాస్‌ గౌడ్‌కు మధ్య విభేదాలు కారణమని తెలుస్తున్నా, నిందితులకు బీజేపీ (BJP) నేతలకు మధ్య సంబంధాలు ఉన్నట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కొంత మంది బీజేపీ నేతల పేర్లు తెరపైకి రావడంతో రాజకీయంగానూ రచ్చ మొదలైంది.