KCR meets party leaders: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భారత్ రాష్ట్ర సమితి  అభ్యర్థి  మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా పార్టీ అధినేత  కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగింది, ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సహా సీనియర్ నేతలు, నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు, క్లస్టర్ల ఇన్‌చార్జులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు మరియు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

Continues below advertisement


సమావేశంలో కేసీఆర్ నియోజకవర్గ ఇన్‌చార్జుల నుంచి  కింది స్థాయి ప్రచార కార్యక్రమాలపై నివేదికలు తీసుకున్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తున్నదని.. సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలవాలని ఆదేశాలు జారీ చేశారు. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ వంటి సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం లేదని.. కానీ ఆయన రోజూ ప్రచారసరళిని పరిశీలించి వ్యూహాలు ఖరారు చేస్తారని అంటున్నారు. 


జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2025 జూన్ 8న మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. గోపీనాథ్  మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత గోపీనాథ్‌ను రంగంలోకి దింపింది. కేసీఆర్ అక్టోబర్ 14న సునీతకు బీ-ఫారమ్ అందజేసి, ఎన్నికల ఖర్చుల కోసం రూ.40 లక్షల చెక్ ఇచ్చారు. సునీత అక్టోబర్ 15న నామినేషన్ దాఖలు చేశారు, ఆమె కుటుంబ ఆస్తులు రూ.25 కోట్లు, స్వంత ఆస్తుల్లో రూ.8.2 కోట్ల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ప్రకటించారు.
 
 గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు   తారక్ ప్రద్యుమ్న ..  సునీత గోపీనాథ్‌తో ఎలాంటి చట్టబద్ధమైన వివాహం లేదని, వారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఆరోపించారు. సునీత నామినేషన్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, గోపీనాథ్ ఏకైక చట్టబద్ధ భార్య మాలినీ దేవి అని పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఈ విషయం కోర్టుల పరిధిలో ఉందని, సునీత నామినేషన్‌ను అంగీకరించింది. బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసినా, బీ-ఫారమ్ లేకపోవడంతో తిరస్కరించారు.   





 
ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. కేటీఆర్ కాంగ్రెస్‌పై 'వోట్ చోరీ' ఆరోపణలు చేశారు, ఒకే ఇంటి నంబర్‌లో 40-43 మంది ఓటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది, ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ ఉన్నారు. ఈ ఉప ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీగా మారాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, ప్రచారం మరింత ఊపందుకుంది.