KCR Help to Constable Daughter: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి తాను ఆర్థిక సాయం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కిష్టయ్య మరణం నాటికి ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు కాగా.. వారి చదువుతో సహా ప్రతి కష్టకాలంలో అండగా నిలుస్తూ వచ్చారు. వారి కుటుంబానికి గుండె ధైర్యమిచ్చారు. నాడు కిష్టయ్య బిడ్డ ఎంబీబీఎస్ వైద్య విద్య కోసం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. నాడు ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతుంది. అందుకు మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజు కోసం కావలసిన రూ.24 లక్షల రూపాయల చెక్కును నేడు (జూన్ 2) నంది నగర్ లో  కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. 


అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. “రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్న పిల్లలు. కష్టకాలంలో కూడా మీ అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది, చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటూనే ఉంటుంది.” అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు.


ఈ సందర్భంగా తమ కుటుంబాన్ని ఇంటి పెద్దలా  అదుకుంటున్న కేసీఆర్ కు కిష్టయ్య కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. కాగా తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరులను తమ ప్రభుత్వం లో ఆదుకున్నామని అదే స్ఫూర్తిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ అన్నారు.


ఈ సందర్భంగా అమరుడు పోలీస్ కిష్టయ్య భార్య పద్మావతి మాట్లాడుతూ.. “నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తి అయింది. మా నుండి పోలీస్ కిష్టయ్య(మా భర్త) దూరమై 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని నా తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చాడు. “నీవు బాధ పడకమ్మా…నీ పిల్లలను నేను చూసుకుంటా” అన్నరు. వారిచ్చిన మాట ప్రకారమే..మా పిల్లలకు మా కుటుంబానికీ అన్ని విధాలా అండగా ఉన్నారు. నా బిడ్డ మెడికల్ కాలేజి లో చదువుకు డబ్బులు ఇస్తున్నారు. 6వ తరగతి నుండి ఇప్పటి వరకు అన్ని విధాలా అసరాను అందిస్తున్నారు.” అని తెలిపింది.