Kavitha Latest Statement: ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు కవిత. రాజకీయాల్లో అవకాశాలు ఎవరూ ఇవ్వరని తొక్కుకుంటూ వెళ్లాలని చెప్పుకొచ్చారు. జాగృతి కార్యాలయంలో ఆల్మట్టి ఎత్తు పెంపుపై మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయలపై మాట్లాడారు. ఎంతమంది జై బీసీ అంటే అంత త్వరగా బీసీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో తనకు జరిగిన ఇబ్బందులపై సీఎం ఏమన్నారో తెలియదన్నారు. కానీ పార్టీలో ఇబ్బందులు పెట్టారని తెలంగాణ ప్రజలకు తెలుసని వివరించారు. అయితే తను అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారేమో అని సందేహం వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్ అగ్రనాయకత్వం సంప్రదించలేదని తనకు ఆ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదని పేర్కొన్నారు. అసలు ఆ పార్టీ తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.
హరీష్ రావు మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా, సంతోష్ రావు సీక్రెట్ మీడియా దాడి చేస్తున్నాయని తెలిపారు. గతేడాది రాజకీయ కారణాలతో బతుకమ్మను జరుపుకోలేకపోయామన్నారు. ఇప్పుడు జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలకు హాజరు అవుతున్నట్టు ప్రకటించారు. సొంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది కాబట్టే చింతమడకకు బతుకమ్మ ఉత్సవాలకు వెళ్తున్నట్టు వెల్లడించారు. చింతమడకకు వెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూస్తారని తెలుసని అభిప్రాయపడ్డారు.
కృష్ణానది సగం తెలంగాణకు ప్రాణదాయనిగా ఉందన్నారు కవిత. ఉమ్మడి ఏపీలో కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా కోసం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో కేసు వేస్తేనే స్టే వచ్చిందని వివరించారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడానికి లక్షా 30వేల ఎకరాలు సేకరించడానికి సిద్ధమైందని ఆందోళన వ్యక్తం చేశారు. 5 మీటర్ల ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోందన్నారు. అదే జరిగితే కృష్ణా నదిలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేది ఏం లేదని ఎద్దేవా చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునుగుతాయని అక్కడి సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణ సీఎంకు మాత్రం మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయం ఎందుకు తెలియటం లేదో అర్థం కావడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనించాలని సూచించారు.
పాలమూరు పులిబిడ్డ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు, కృష్టా నది ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు కవిత. కాంగ్రెస్ సుప్రీం సోనియాగాంధీతో కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు ఫోన్ చేయించి ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఆపాలని కవిత డిమాండ్ చేశారు.హైదరాబాద్లో కృష్ణా నది బోర్డు మీటింగ్ ఉందని ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎం పాల్గొని అల్మట్టికి వ్యతిరేకంగా వాదనలు వినిపించాలన్నారు. అవసరం లేని వాటికి సుప్రీంకోర్టుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలన్నారు.
గ్రూప్-1 విషయంలో అవసరం లేకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డివిజన్ బెంచికి వెళ్ళిందని కవిత గుర్తు చేశారు. అల్మట్టిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే జాగృతి తరపున సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. అల్మట్టి విషయంలో రేవంత్ రెడ్డి పాలమూరు పులినా? పేపర్ పులినా అనేది తేలుతుందన్నారు. బనకచర్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నట్లుగానే అల్మట్టిపై కూడా వెళ్తామని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అప్పగించారని పునర్విమర్శలు చేశారు. ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్య నాథ్ దాస్ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవడంతోనే ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు.
ఆదిత్య నాథ్ దాస్కు తెలంగాణ మీద ఎందుకు ప్రేమ ఉంటుందని కవిత ప్రశ్నించారు. ఆ అధికారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ మీద ఉన్న ప్రేమను నిరూపించుకోవాలి ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. అల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయం కాలేదని చెప్పటం అబద్దమన్నారు. కర్ణాటక ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకొని రూ.70 వేల కోట్లను కూడా దశల వారీగా విడుదల చేయనుందన్నారు. భూసేకరణకు కూడా ప్రణాళిక సిద్దం చేశారని పేర్కొన్నారు. అయినా కూడా నిర్ణయం కాలేదని చెబుతున్నారంటే...మహబూబ్ నగర్ వాసులకు సీఎం ద్రోహం చేస్తున్నట్టేనన్నారు.
బీసీల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కవిత. ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదన్నారు. రిజర్వేషన్ల విషయాన్ని పట్టించుకోకపోతే జాగృతి ఆధ్వర్యంలో మంత్రులు, సీఎం ఇళ్లను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పదవి వద్దని స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఛైర్మన్ డిలే చేస్తున్నారని మళ్లీ రాజీనామా ఇవ్వమంటే ఇస్తానన్నారు.
గత ప్రభుత్వం దసరాకు బతుకమ్మ పేరుతో చీరలు ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే రెండు బతుకమ్మ చీరలు ఇస్తామని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని రిక్వస్ట్ చేశారు. బతుకమ్మ పేరునే కొనసాగించాలని లేకపోతే తెలంగాణ ఆడబిడ్డ పేరు పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని మండిపడ్డారు. దశలవారీగా పేర్లు మారుస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారన్నారు.