Patancheru Latest News: తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. పటాన్ చెరు కాంగ్రెస్‌ నేతలు రోడ్డున పడి కొట్టుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గం రోడ్డు ఎక్కి సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు అందుకుంది. పాత కొత్త కాంగ్రెస్‌ నేతల మధ్య పొసగడం లేదని అధినాయక్వం కలుగుజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

పటాన్ చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ కాంగ్రెస్ చిచ్చు పెట్టాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు వ్యతిరేకంగా విమర్సలు చేయడం ప్రస్తుతం వివాదానికి కారణమైంది. ఆయన కామెంట్స్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు ధర్నాలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వచ్చి తమపై పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినప్పటి నుంచి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అనేక రకాలుగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అదే స్థాయిలో ఎమ్మెల్యే వర్గం నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేగా తన పనులకు అడ్డంకిగా మారుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. 

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్‌కి అసలు పడటం లేదు. బీఆర్‌ఎస్‌లో తిరుగాబుట జెండా ఎగరేసి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినప్పటి నుంచి మహిపాల్ రెడ్డి పెత్తనం ఎక్కువైపోయిందని శ్రీనివాస్‌ గౌడ్ వర్గీయులు దుమ్మెత్తి పోస్తున్నారు. వీళ్లకు తోడు నీలం మధు కూడా వంతపాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు వేధించారని ఇప్పుడు అదే పంథా సాగిస్తున్నారని మండిపడుతున్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా చెప్పుకొని మహిపాల్‌ రెడ్డి ఆఫీస్‌లో సీఎం ఫొటో లేదని ఇంకా కేసీఆర్ ఫొటో ఉందని ఆరోపించారు కాట శ్రీనివాస్ వర్గీయులు. ఆయన కార్యాలయంలోకి వెళ్లి కేసీఆర్ ఫొటో తీసేసి రేవంత్‌ ఫొటో పెట్టారు. ఈ టైంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మరికొందరు ఫర్నీచర్‌ను కూడా రోడ్డుపైకి తీసుకొచ్చి ధ్వంసం చేశారు. 

Also Read: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు

పటాన్ చెరు కాంగ్రెస్‌లో జరుగుతున్న రగడపై అధినాయకత్వం జోక్యం చేసుకోవాలని శ్రీనివాస్‌, నీలం మధు వర్గీయులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు ఎక్కిన ఈ ఇద్దరి నేతల అనుచరులు సేవ్ కాంగ్రెస్ - సేవ్ పటాన్ చెరు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ నేతల ధర్నాతో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని అక్కడి వారందర్ని తరలించారు. ముందస్తుగా అక్కడ భారీగా సిబ్బందిని మోహరించారు. 

కాంగ్రెస్ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్ రెండు సార్లు మహిపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నీలం మధు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించిభంగపడ్డారు. ఆయన కాంగ్రెస్‌ నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి కూడా టికెట్ కోసం ప్రయత్నించారు. రెండు పార్టీల్లో ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో బీఎస్పీ టికెట్ తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 

ముగ్గురు నేతల కన్ను పటాన్‌చెరుపై ఉంది. అందుకే ఒకరంటే ఒకరికి పడటం లేదు. అయితే ఇక్కడ ప్రస్తుతం పదవిలో ఉన్న మహిపాల్‌రెడ్డితో మిగతా ఇద్దరు తీవ్రంగా విభేదిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఆయనపై పోరాటం చేస్తున్నారు. ఇలా పటాన్‌చెరు మూడు ముక్కలాటలో కేడర్ మాత్రం ఇబ్బంది పడుతున్నారని వెంటనే ముగ్గురు నేతలతో అధినాయకత్వం పిలిచి మాట్లాడాలని కోరుతున్నారు. 

Also Read: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి