తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా మార్పే కీలకమైన మీటింగ్‌కు జెడిఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి కూడా హాజరయ్యారు. బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దళితుల పట్ల రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్న కమిట్‌మెంట్ గొప్పదన్నారు. కెసిఆర్  అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో విజయం సాధించారని తెలిపారు. ఇది గొప్ప విషయమన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతగా పోరాటం చేశారో అందరికీ తెలుసని... అదే పోరాటంతో ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అదే పద్దతిలో దేశవ్యాప్తంగా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు.  


తెలంగాణను అభివృద్ధి చేయాలనే కేసీఆర్‌ కలను సాకారం చేసుకున్నారని... దేశాభివృద్దిని సవాలుగా తీసుకోవాలన్నారు. కేసీఆర్‌ హృదయాంతరాల్లోంచి వచ్చిన మాటలు పేదలు బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న నిబద్దత తెలియజేస్తోందన్నారు. దళితులు, రైతుల అభివృద్దిని తెలంగాణలో పెద్ద ఎత్తున సాధించారన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం దేశ నిర్మాణం కోసమే కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా విస్తరించాలని కోరుకున్నారున్నారు.  


 దేశాభివృద్ధి కోసం మీరు కంటున్న పారదర్శక కల  సాకారం కావాలని కోరుకుంటున్నట్టు వివరించారు కుమారస్వామి. కేసీఆర్ దేశ నిర్మాణానికి అవసరమైన విజనరీ లీడర్, ఛాలెంజింగ్ లీడర్, లిజెండరీ లీడర్ అని కితాబు ఇచ్చారు. తెలంగాణలో విజయవంతమైన కేసీఆర్‌ పనితీరును అంతా గమనిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ విజయం సాధించారన్నారు. అందుకే తాము ఇక్కడి వచ్చామన్నారు. కేంద్రంలో గత ఏడేళ్ల కాలంలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదని.... దానికి గట్టి సమాధానం చెప్పేందుకు కెసిఆర్ నిర్ణయించుకున్నారని తెలిపారు.


రాజకీయ ప్రతీకార భావనతో కాకుండా అభివృద్ధి ద్వారా, దేశ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి సిఎం కెసిఆర్ చేస్తున్న కృషికి తమ మద్దతుంటుందన్నారు కుమార స్వామి. భవిష్యత్ రాజకీయ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు వివరించారు.