New IB Chief Mahesh Dixit:దేశ రక్షణ, అంతర్గత భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిఘా విభాగం ఇంటెలిజెన్స్ బ్యూరో సరికొత్త బాస్‌ను కేంద్రం నియమించింది. భారత ప్రభుత్వ అత్యున్నత నియామకాల కమిటీ దేశ రక్షణ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోస్టుకు తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేష్ దీక్షిత్‌ను నియమించింది. దేశవ్యాప్తంగా ఉన్న అంతర్గత భద్రతా సవాళ్లు, సరిహద్దు ఉగ్రవాదం, సైబర్ దాడుల ముప్పు పెరిగిపోతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ టీమ్ ఈ వ్యూహాత్మక ఎంపిక చేసింది. 

Continues below advertisement

ఈ నియామకంతో తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ ఐపీఎస్ కేడర్‌కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కినట్లయింది. క్షేత్రస్థాయిలో నిఘా ఆపరేషన్లు అత్యంత విజయవంతంగా నిర్వహించిన ట్రాక్ రికార్డ్ మహేష్ దీక్షిత్‌కు ఉంది. గతంలో దేశంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో ఆయన చేసిన కౌంటర్-ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్  కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రశంసలు అందుకున్నాయి. షాడో ఆఫీసర్‌గా, టెక్-సావీ నిఘా నిపుణుడిగా పేరు తెచ్చుకున్న ఒక తెలుగు కేడర్ అధికారి.. దేశ రక్షణ వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐబీకి చీఫ్ అయ్యారు. 

ఎవరీ మహేష్ దీక్షిత్?

నూతన ఐబీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న డాక్టర్ మహేష్ దీక్షిత్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కేడర్ కిందకు వచ్చారు. పోలీస్ సర్వీస్‌లో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే టఫ్‌ ఆఫీసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, తెరవెనుక జరిగే నేరాలను, దేశద్రోహ వ్యూహాలను ముందే పసిగట్టే ఇంటెలిజెన్స్ బ్రెయిన్ ఆయన సొంతం. కేంద్ర ప్రభుత్వ డెప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్ బ్యూరోలో అడుగుపెట్టిన తర్వాత మహేష్ దీక్షిత్ కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరిగింది. ఐబీలో జాయింట్ డైరెక్టర్‌గా, అదనపు డైరెక్టర్‌గా అత్యంత కీలకమైన విభాగాలను ఆయన పర్యవేక్షించారు. 2024 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ఇన్‌-సిటు ప్రాతిపదికన స్పెషల్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పించింది. నిఘా రంగంలో దశాబ్దాల అనుభవం, క్లిష్టమైన కేసులను ఛేదించడంలో ఆయన చూపిన చొరవను గుర్తించి, ప్రస్తుత ఐబీ డైరెక్టర్ పదవీకాలం ముగిసిన తరుణంలో కేంద్రం ఆయనకు దేశ నిఘా పగ్గాలను అప్పగించింది.  

Continues below advertisement

కెరీర్ మైల్‌స్టోన్స్‌ 

మహేష్ దీక్షిత్ కెరీర్‌లో జమ్మూ కశ్మీర్‌లో చేసిన సేవలే కీలకంగా మారాయి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, సరిహద్దు దాటి వచ్చే చొరబాట్లు, లోకల్ స్లీపర్ సెల్స్ నెట్‌వర్క్ ఉధృతంగా ఉన్న సమయంలో ఆయన అక్కడ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. టెర్రర్ ఫండింగ్ మూలాలను దెబ్బతీయడం, సరిహద్దు అవతలి నుంచి వచ్చే కోడెడ్ మెసేజ్‌లను డీకోడ్ చేయడం ద్వారా ఎన్నో భారీ ఉగ్రదాడులను ముందే భగ్నం చేయడంలో ఆయనది కీలక పాత్ర. ఆయన కాశ్మీర్‌లో ఉన్నప్పుడు సృష్టించిన హ్యూమన్ ఇంటెలిజెన్స్  నెట్‌వర్క్ నేటికీ నిఘా వర్గాలలో ఒక కేస్ స్టడీగా చెబుతుంటారు. లోకల్ ఇన్ ఫార్మర్ల ద్వారా సమాచారాన్ని సేకరించడంలో, టెక్నాలజీ ఆధారిత సర్వైలెన్స్‌ను సమన్వయం చేయడంలో మాస్టర్‌మైండ్‌గా నిలిచారు. కాశ్మీర్ ఆపరేషన్లలో చూపిన ఈ అసాధారణ ప్రతిభే ఆయనను ఢిల్లీలోని నార్త్ బ్లాక్ పెద్దలకు అత్యంత నమ్మకస్తుడైన ఆఫీసర్‌గా మార్చింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అంతర్గత నిఘా గ్రిడ్‌ను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారు.  

ఐబీ ప్రాధాన్యత -సవాళ్లు

భారతదేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది దేశ అంతర్గత భద్రతను కాపాడే అత్యున్నత రహస్య నిఘా సంస్థ. విదేశీ నిఘా కోసం రా పనిచేస్తుంటే, దేశ సరిహద్దుల లోపల జరిగే విద్రోహ చర్యలు, తీవ్రవాదం, నక్సలిజం, అంతర్గత కల్లోలాలను అణచివేయడానికి ఐబీ శ్రమిస్తుంది. అటువంటి సంస్థకు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం అంటే ముళ్ల కిరీటాన్ని ధరించడమే. ప్రస్తుత డిజిటల్ యుగంలో నూతన ఐబీ చీఫ్ మహేష్ దీక్షిత్ ముందు చాంతాడంత సవాళ్లు ఉన్నాయి. సైబర్ వార్‌ఫేర్,  డిజిటల్ దాడులు, ప్రభుత్వ డేటా హ్యాకింగ్ ప్రయత్నాలు, డీప్‌ఫేక్, సోషల్ మీడియా ప్రొపగాండాకు బ్రేక్ వేయడం. దేశంలోని ప్రధాన నగరాల్లోని స్లీపర్ సెల్స్ కదలికలపై డేగకన్ను వేసి ఉంచడం ఇవన్నీ నియంత్రించడం ఆయన ముందు ఉన్న సవాళ్లు. 

మోదీ సర్కార్ ఎంపిక వెనుక అసలు వ్యూహం

రాబోయే రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎదురయ్యే సరికొత్త భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక డైనమిక్, యాక్షన్-ఓరియెంటెడ్ ఆఫీసర్ అవసరమని భావించే మహేష్ దీక్షిత్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం పొరుగు దేశాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల దేశంలో అంతర్గత శాంతిభద్రతలు అత్యంత ముఖ్యం. ఏ చిన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగినా అది దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది. అందుకే, దేశంలోని ప్రతి అంగుళంపై అవగాహన ఉన్న, ముఖ్యంగా కాశ్మీర్ వంటి కఠిన ప్రాంతాల్లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పాతరేసిన అనుభవం ఉన్న దీక్షిత్ అయితేనే ఈ పదవికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేయగలరని కేంద్రం గట్టిగా విశ్వసించింది.