Indiramma Double Bedroom Housing Scheme | హైదరాబాద్ నగర పరిధిలోని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి విశేష స్పందన లభించింది. మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, CURE పరిధి లోని 16 నియోజకవర్గాల పరిధి నుండి మొత్తం 60,014 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి.వి గౌతం వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత కంప్యూటరైజ్డ్ పద్ధతిలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.

Continues below advertisement

4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

అదే సమయంలో, నగరంలో ఇళ్లు లేని మిగతా అర్హులకు అవకాశం కల్పించేందుకు మరో 4 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలు మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా సెప్టెంబర్ 3వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఆన్మగల్‌లో, గోషామహల్, ముషీరాబాద్ నియోజకవర్గాలకు జమిస్తాన్‌పూర్‌లో.. అలాగే చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి బండ్లగూడ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు.

Continues below advertisement

ఇటీవల కూకట్‌పల్లి పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తే కూకట్ పల్లి ప్రజలు తనను ఆశీర్వదించి ఢిల్లీకి పంపారని గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉండగా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన తీరుగా అభివృద్ధి చేయలేకపోయానని, ఇప్పుడు సీఎంగా కూకట్ పల్లిని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా మంత్రి శ్రీధర్ బాబు పనులు చేసి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల వారి పరిపాలనతో తమ రెండున్నరేళ్ల పాలనను బేరీజు వేసుకుంటే ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయన్నారు.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

పేదల సొంతింటి కల నెరవేర్చాలని తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం సొంత స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, స్థలం లేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఉచితంగా అందిస్తోంది. క్షేత్రస్థాయిలో అధికారులు సేకరించిన దరఖాస్తులను పరిశీలించి, ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌లు, రేషన్ కార్డ్ వివరాలతో సరిపోల్చిన తర్వాతే అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఇందిరమ్మ కాలనీలలో కేవలం గృహాలు మాత్రమే కాకుండా మంచినీటి సదుపాయం, విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అన్ని రకాల కనీస మౌలిక వసతులను కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 నుంచి 4 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి పేదల సొంతింటి కల సాకారం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.