Revanth Reddy: హైదరాబాద్ గాంధీ భవన్ లో స్వాతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 140కోట్ల భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈరోజు ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలన్నారు. అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని, అలాగే అంబేద్కర్ దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారని చెప్పుకొచ్చారు. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని చెప్పుకొచ్చారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అంటూ ప్రశంసించారు. 






పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశాన్ని ఆర్థికంగా పురోగతి వైపు నడిపించారన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంభిస్తోందన్నారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని రేవంత్ రెడ్డి చెప్పారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారని గుర్తు చేసారు. కానీ వాస్తవానికి పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రమేనని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. మణిపూర్ మండుతుంటే మోదీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి... కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐ ని పంపించారని ఫైర్ అయ్యారు. నియంతలకంటే నికృష్టాంగ మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 


 I.N.D.I.A  ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నాడని తెలిపారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు,  డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందంటే అది కాంగ్రెస్ వల్లేనని చెప్పారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరని, బీఆరెస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని.. 10వేల ఎకరాలు దోచుకుందని అన్నారు. 


కాంగ్రెస్ వస్తుంది రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని.. "తిరగబడదాం, తరిమికొడదాం" నినాదంతో ప్రజల్లోకి వెళదామని ప్రజలకు సూచించారు. ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని వెల్లడించారు.