Hyderabad News :  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అతివేగంతో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన మహిళలు, ర్యాష్‌డ్రైవింగ్‌ చేశారు. బంజారాహిల్స్‌లో బీఎండబ్ల్యూ  TS 09 EJ 5688  నెంబర్  కారు రాత్రి అతివేగంతో వచ్చింది. ఖాళీగా ఉన్న రోడ్డుపై జీహెచ్‌ఎంసీ ఉద్యోగి బైక్‌పై వస్తున్నాడు. తన రూట్లోనే వెళ్తున్నాడు. కానీ ఉన్నట్లుండి తెలుపు బీఎండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చింది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగి జి.బాలచందర్‌ బైక్‌పైకి దూసుకెళ్లింది. దాంతో అతను రోడ్డుపై దూరంగా పడిపోయాడు. కారులో ప్రమాద సమయంలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారు ఇద్దరూ కూడా మద్యం సేవించి కారు అత్యంత వేగంతో నడిపారని స్థానికులు అంటున్నారు. 


బైక్‌ను ఢీకొట్టిన తర్వాత అక్కడే కొద్ది క్షణాలు కారు ఆపారు. కానీ జనాలు గుమిగూడటం గమనించి అక్కడి నుంచి పరారయ్యారు కారులో ఉన్న మహిళలు. అయితే.. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా.. ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ మేనేజర్ జి.బాలచందర్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు అధికారులు.                    





 మూడు రోజుల క్రితమే హైదరాబాద్ శివారు సన్ సిటీ వద్ద ఇలాగే ఓ కారు ప్రమాదంలో ఇద్దరు  చనిపోయారు.  మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు  అక్కడికక్కడే మృతి చెందారు.  అతివేగమే ప్రమాదానికి కారణం . మహిళలు రోడ్డు పక్కగా వాకింగ్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పి వారిపైకి దూసుకుపోయింది. ఇందులో ముగ్గురు యువకులు ఉన్నారు. ప్రమాదం  జరిగిన తర్వాత వారు కారును అక్కడ వదిలేసి.. నింపాదిగా పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ప్రాణాలు తీసి ఇలా వెళ్లిపోతారా అని అంతా ఆశ్చర్యపోయారు.                                                                                            


బంజారాలిస్ ఘటనలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ మనిషిని ప్రాణపాయంలోకి నెట్టేసి.. ఏ మాత్రం మానవత్వం లేకుండా.. కనీసం ఆపకుండా వెళ్లిపోయారు కారులో ఉన్నవారు.