పైచదువులు చదువుకునేందుకు అమెరికాకు వెళ్లిన ఓ మహిళ ఇప్పుడక్కడ దిక్కులేని స్థితిలో కాలం గడుపుతోంది. కనీసం తినేందుకు సైతం తిండి లేని స్థితిలో ఆకలితో అలమటిస్తూ ఉంది. ఈమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ అమెరికాలోని చికాగోలో ఉన్న పరిస్థితి తెలుసుకున్న ఆమె తల్లి.. ఆమెను ఎలాగైనా ఇంటికి రప్పించాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆమె కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. ఆ మహిళ దీనమైన వీడియోను బీఆర్ఎస్ లీడర్ ఒకరు ట్విటర్ లో పోస్ట్ చేశారు. 


వివరాలివీ


హైదరాబాద్‌ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మౌలాలి ప్రాంతానికి చెందిన సయ్యద్ లులు మిన్హాజ్ జైదీ అనే మహిళ పైచదువుల కోసం 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లింది. ఆమెకు స్టూడెంట్ వీసా వచ్చింది. అక్కడికి వెళ్లిన మిన్హాజ్ తరచూ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉండేది. కానీ, గత రెండు నెలలుగా తల్లీ కూతురు మధ్య ఎలాంటి ఫోన్ కాల్స్ లేవు. కనీసం కుమార్తె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. అమెరికాలో నివసించే తెలిసిన వారితో తల్లి ఆరా తీయించింది. అప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది.


అమెరికాలో ఆమె వస్తువులను ఎవరో దొంగలు దొంగలించారని తెలిసింది. దీంతో బాధితురాలు గతి లేని పరిస్థితుల్లో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని తల్లికి సమాచారం అందించారు. అంతేకాకుండా లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్నట్లు తెలిపారు.
దీంతో తల్లడిల్లిపోయిన తల్లి ఎలాగైన తన కుమార్తెను వెనక్కు రప్పించాలని వేడుకుంటున్నారు. తన కుమార్తెను తిరిగి హైదరాబాద్ కు  తీసుకురావాలని వహాజ్ ఫాతిమా కేంద్రమంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. 


తన కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్‌ చేయడానికి వెళ్లిందని.. రెండు నెలలుగా ఆమె తనకు ఫోన్‌  చేయడం లేదని.. హైదరాబాద్‌ లో తమకు తెలిసిన వారు అమెరికాలో ఉంటుండగా, వారితో ఆరా తీయించినట్లుగా వెల్లడించారు. వారు చికాగోలో తన కుమార్తెను గుర్తించి ఆమె దీన స్థితి గురించి వివరించారని లేఖలో పేర్కొన్నారు. ఆమె వస్తువులు చోరీకి గురయ్యాయని.. చేతిలో డబ్బులు లేక ఆకలితో అలమటిస్తోందని వివరించారు. ఆమెను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నానని బాధితురాలి తల్లి లేఖలో పేర్కొంది.