Hyderabad Traffic: గత వారం పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈక్రమంలోనే ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు సొంత కార్లలో కాకుండా కారు పూలింగ్ లో వెళ్లాలని సూచించారు. వీలైనంత వరకు మెట్రో, ఆర్టీసీ వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ప్రయాణించాలని పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ లో ఐటీ కంపెనీల ప్రతినిధులు, హోటల్స్, హాస్పిటల్స్, ఫార్మా కంపెనీల సీఈఓలు, పోలీసు అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు. 






ఈక్రమంలోనే సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ లో వర్షపు నీరు నిలిచే రోడ్లను గుర్తిస్తామన్నారు. 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వెంటనే స్పందించేందుకు 10 ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటినుంచే పని చేసే విధంగా కంపెనీలు చూడాలని అన్నారు. ఐటీ కారిడార్ లో వానలతో తలెత్తే ట్రాపిక్ సమస్యలు, వాటర్ లాగింగ్ పాయింట్లపై కాల్ చేసేందుకు మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ నెంబర్.8712663011, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ నెంబర్.8712663010, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ 9490617346, ఏవైనా వాహనాలు రోడ్డుపైనే బ్రేక్ డౌన్ అయితే 8333993360 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయాలని సూచించారు. రోజుకు 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులోనే ఉంటాయని వెల్లడించారు. 






ఇక వర్షాల విషయానికి వస్తే మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని సార్లు అత్యంత వేగంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటాయని చెప్పింది. ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ అధికారులు సూచించారు. నిన్నటి నుంచి హైదరాబాద్ లో ముసురు పడుతోంది.