హైదరాబాద్‌ నగరంలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఓ కారు కలకలం రేపింది. ఆ కారును ఎవరో అనుమానాస్పద రీతిలో నిలిపి ఉంచారు. అది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్లుగా సెక్యురిటీ సిబ్బంది గుర్తించారు. ఒక టాటా నానో కారు బీజేపీ కార్యాలయం ఎదుట గత సోమవారం నుంచి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నానో కారులో ఓ సూట్‌కేసు కూడా ఉంది. దీంతో బీజేపీ కార్యాలయ సిబ్బంది బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు.


ఆ తర్వాత కాసేపటికే బీజేపీ కార్యాలయం ముందు పార్క్ చేసిన కారుకు సంబంధించిన ఓనర్ అక్కడికి వచ్చారు. ట్విస్ట్ ఏంటంటే.. కారులో ఉన్న సూట్ కేస్‌లో బట్టలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. బీజేపీ కార్యాలయం పక్క కాలనీలో ఉండే వ్యక్తి ఇక్కడ కార్ పార్క్ చేశాడని చివరికి తేలింది. ఇన్వెస్టిగేషన్ కోసం కారును, కారు ఓనర్‌ను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడ పార్క్ చేయడానికి కారణాలు, ఏమైనా కుట్ర ఉన్నదా అనే కోణంలో అనుమానంతో కారు ఓనర్‌ను విచారణ చేస్తున్నారు.


14వ రోజుకు మూడో విడత పాదయాత్ర


ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 14వ రోజుకు చేరుకుంది. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయీ వర్ధంతి సందర్భంగా.. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు బండి సంజయ్. అనంతరం 14వ రోజు పాదయాత్ర ప్రారంభం అయింది.


నేడు విసునూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణ పురం స్టేజ్ మీద నుండి పాలకుర్తి, లక్ష్మీనారాయణ పురం స్టేజ్, తొర్రూరు, శాతాపురం, ధర్మతాండ స్టేజ్ మీదుగా కడవెండి స్టేజి వరకు కొనసాగనుంది. విసునూరు, పాలకుర్తిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు బండి సంజయ్. ఇవాళ మొత్తం 16 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. నేడు కడవెండి స్టేజి సమీపంలో బండి సంజయ్ రాత్రికి బస చేయనున్నారు.


నిన్న ఉద్రిక్తతలు
నిన్న (ఆగస్టు 15) జనగామ (Janagama) జిల్లాలోని దేవరుప్పుల (Devaruppula) మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం ఉదయం ప్రారంభించారు. అయితే, దేవరుప్పుల మండలంలోకి స్థానిక బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు ఘనంగా స్వాగతం పలికారు. ఆ పార్టీకి చెందిన యువకులు బాణసంచా కాలుస్తూ బండి సంజయ్ ను ఆహ్వానించారు. అనంతరం దేవరుప్పలలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్‌ మాట్లాడుడారు.


ఈ సమయంలోనే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అది క్రమంగా ఘర్షణకు దారి తీసింది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్‌ మాట్లాడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న కొంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలతో విభేదించారు. వారు బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా నినాదాలు చేస్తూ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 


దీంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, టీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో అది దాడులకు దారి తీసింది. ఒక వర్గంపై మరో వర్గం రాళ్ల దాడి కూడా చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొంత మంది బీజేపీ, టీఆర్ఎస్ నేతలకు గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చివరికి వారిని అదుపు చేశారు. ఈ రాళ్ల దాడిలో కొందరు నేతల తలలు పగిలిపోయాయి. వారికి రక్తం కారడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 


సీపీపై బండి సంజయ్ ఫైర్
ఈ ఘటనపై జిల్లా సీపీని బండి సంజయ్ విమర్శించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కూర్చోవాలని అన్నారు. ఈ మేరకు డీజీపీతో బండి సంజయ్ మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే అన్నారు. తక్షణమే పాదయాత్ర సాఫీగా సాగేలా చూడాలని అన్నారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను బండి సంజయ్ ట్విటర్ లో పెట్టారు. ఆ తర్వాత కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు.