హైదరాబాద్‌‌లోని సనత్‌ నగర్‌లో 8 ఏళ్ల బాలుడిని ఓ హిజ్రా నరబలి చేసిందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఆ హత్యకు గల కారణాన్ని వివరించారు. సరిగ్గా అమావాస్య నాడు బాలుడి హత్య జరగడంతో అది నరబలి అని ప్రచారం జరిగిందని పోలీసులు చెప్పారు. అయితే ఈ హత్యకు నరబలికి ఎలాంటి సంబంధం లేదని డీసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బాలుడి తండ్రికి, హిజ్రాకు మధ్య ఉన్న గొడవల కారణంగా హత్య జరిగిందని వెల్లడించారు. బాలుడి హత్యకు పాల్పడిన హిజ్రా ఫిజాఖాన్‌తో సహా మరో నలుగురు వ్యక్తుల్ని తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. 


చిట్టీ వ్యాపారంలో గొడవే హత్యకు కారణం
ఫిజాఖాన్‌ అనే హిజ్రా స్థానికంగా చిట్టీల వ్యాపారం చేస్తుంటుంది. ఆ హిజ్రా దగ్గర బాలుడి తండ్రి వసీం చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించి డబ్బుల వ్యవహారంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవతో బాలుడి తండ్రిపై కోపం పెంచుకున్న హిజ్రా.. అతనిపై పగ తీర్చుకునేందుకు బాలుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో బయటికి వచ్చిందని డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. బాలుడి హత్యకు నరబలికి సంబంధం లేదని స్పష్టం చేశారు.


అసలేం జరిగిందంటే..
సనత్ నగర్‌లోని అల్లావుద్దీన్‌ కోటి ఏరియాలో గురువారం ఏనిమిదేళ్ల బాలుడు అబ్దుల్‌ వహీద్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. బాలుడి మృతదేహం అదే ఏరియాలోని ఓ నాలాలో కనిపించింది. నాలుగో తరగతి చదువుతున్న అబ్దుల్‌ వహీద్‌ అనే ఎనిమిది ఏళ్ల బాలుడు గురువారం సాయంత్రం నమాజ్‌ చేయడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. ఇతను స్థానిక బట్టల వ్యాపారి వసీం ఖాన్ కుమారుడు. బాలుడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి.. చివరికి సనత్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు బకెట్‌లో కుక్కి ఉన్న బాలుడి మృతదేహం జింకలవాడ నాలాలో స్థానికులకు కనిపించింది. బాలుడిని హత్య చేసిన నిందితులు ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఒక బకెట్‌లో కుక్కినట్లుగా చూసి స్థానికులు హడలిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని నాలా నుంచి బయటికి తీశారు.


అయితే, వహీద్‌ ఇంటి పక్కనే ఉండే ఇమ్రాన్‌ అనే హిజ్రా బాలుడిని మజీదు నుంచి తనతో వెంటబెట్టుకొని వెళ్లినట్లుగా స్థానికులు ఆరోపించారు. బాలుడిని చంపి ఓ బస్తాలో వేసుకొని ఆటోలో తీసుకువెళ్లిన్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా దొరికింది. దీంతో స్థానికులు హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చారు.


అయితే, ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాలుడు వహీద్‌ హత్యకు గురువ్వడం చాలా బాధాకరమని అన్నారు. తాను పోలీసు అధికారులతో మాట్లాడానని, దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.