Hyderabad Outer Ring Road speed limit increased to 120 kmph:
హైదరాబాద్ కు మణిహారంగా నిలిచిన ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనదారులు మరింత వేగంతో దూసుకుపోవచ్చు. ఈ మేరకు పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓఆర్ఆర్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడానికి వాహనదారులకు అనుమతి ఉంది. అయితే ఈ వేగాన్ని తాజాగా 120 కిలోమీటర్లకు పెంచింది ప్రభుత్వం. పురపాలకశాఖ, ఓఆర్‌ఆర్‌ అధికారులతో మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణికుల భద్రతకు మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటాం అన్నారు. సమీక్ష అనంతరం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పై స్పీట్ లిమిట్ ను 120 కిలోమీటర్లకు పెంచినట్లు వెల్లడించారు.


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ అప్పగింత విషయంపై వివాదం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్ పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుందని. ఇది ఏటా ఐదు శాతం పెరగుతూ పోయినా 30 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం చేకూరేదన్నారు. సొంత ప్రయోజనాలతో రాష్ట్రానికి వేలకోట్ల నష్టం వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ ఆరోపణలపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని పలుమార్లు డిమాండ్ చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial