Restrictions on New Year Celebrations: న్యూఇయర్‌ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నగరవాసులు. ముఖ్యంగా హైదరాబాద్‌ వాసులు న్యూఇయర్‌ వేడుకలకు  సిద్ధమవుతున్నారు. పబ్బులు, బార్లు, క్లబ్బులు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో నగరవాసులను.. ఆకర్షించే పనిలో మునిగిపోయి ఉన్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు  పలుకుతూ... కొత్త సంవత్సరానికి మంచి జోష్‌తో గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పబోతున్నారు. అయితే... ఈ వేడుకల్లో ఎక్కడా శృతిమించొద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌  పోలీసులు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. 


డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి నుంచి న్యూఇయర్‌ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపేవారితోపాటు... అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు. యాజమాన్యాలు తమ ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అతివేగం, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ జంపింగ్‌, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం‌, హెల్మెట్‌  పెట్టుకోకపోవడం వంటివి గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమిస్తే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 


న్యూఇయర్‌ వేడుకల కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు సైబరాబాద్‌ పోలీసులు. 31వ తేదీ రాత్రి అన్ని రహదారుల్లో రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్‌డ్రైవ్‌  నిర్వహించబోతున్నారు పోలీసులు. గత ఏడాది రాత్రి 10గంటల తర్వాత డ్రంకెన్‌ డ్రైవ్‌లు నిర్వహించేవారు. కానీ... ఈ సారి రాత్రి 8గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు  చేస్తామంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే జైలుకు వెళ్లక తప్పదంటున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ ఒకసారి పట్టుబడితే రూ.10వేల జరిమానా.... 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అదే... డ్రెంకెన్‌ డ్రైవ్ చేస్తూ ఎక్కువసార్లు దొరికితే రూ.15వేల జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష పడుతుందట. అంతేకాదు డ్రైవింగ్‌  లైసెన్సు సస్పెన్షన్‌ చేసేందుకు సిఫారసు చేస్తారు పోలీసులు. సరైన పత్రాలు లేకుండా నడిపే వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా,  మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే.. కేసులు పెడతారు. వాహనం నడిపిన వారితోపాటు యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


అధిక శబ్దాలు కూడా చేయకూడదట. పెద్దపెద్ద సౌండ్‌ సిస్టమ్స్‌లో పాటలు పెట్టుకున్నా... వాహనాలకు నంబరు ప్లేట్‌ లేకున్నా సీజ్‌ చేస్తామని చెప్తున్నారు.  కార్లల్లో కిక్కిరిసి కూర్చున్నా... కారు పైభాగంలో కూర్చుని ప్రయాణించినా కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. ఇక... ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై 31వ తేదీ రాత్రి 10  నుంచి ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలు తప్ప... ఇతర వాహనాలను అనుమతించరు. శిల్పాలేఅవుట్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ,  షేక్‌పేట, మైండ్‌ స్పేస్‌, రోడ్‌ నం.45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్జి, సైబర్‌ టవర్స్‌, ఫోరం మాల్‌, జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్‌, బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్లు కూడా మూసేస్తారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తారు. 


క్యాబ్‌ డ్రైవర్లకు కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని... రైడ్‌ నిరాకరిస్తే జరిమానా విధిస్తామని తెలిపారు. ట్యాక్సీ,  క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపారు. అంతేకాదు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించకూడదని... ఎట్టిపరిస్థితుల్లో రైడ్‌ నిరాకరించకూడదని స్పష్టం చేశారు. రూల్స్‌ మీరితే... మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద 500 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. ఎవరైనా క్యాబ్‌ డ్రైవర్‌...  రైడ్‌ రద్దు చేస్తే... 9490617346 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు పోలీసులు. క్యాబ్‌ నెంబర్‌, సమయం, ప్రదేశం తదితర వివరాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు  సూచించారు.