తెలంగాణ ప్రభుత్వం పిలుపు ఇచ్చిన మేరకు స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో సామూహిక జాతీయ గీతాలాపనకు అన్ని శాఖలు, సంస్థలు సహకరిస్తున్నాయి. అందుకోసం హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కూడా తనవంతుగా సహకారం అందిస్తోంది. మంగళవారం (ఆగస్టు 16) ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన ఉన్నందున ఆ సమయంలో రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేయనున్నారు. సుమారు ఒక నిమిషం పాటు రైళ్లను ఎక్కడ ఉన్న మెట్రో రైళ్లు అక్కడే ఆగిపోనున్నాయి. జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత మెట్రో సేవలు తిరిగి ప్రారంభం అవుతాయి. మైట్రో స్టేషన్లు, రైళ్లలో జాతీయ గీతాన్ని ప్లే చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మెట్రో రైళ్లు, స్టేషన్లలో ప్రయాణికులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, జాతీయ గీతం మొదలయ్యే సమయంలో అందరూ గౌరవసూచకంగా నిలబడాలని మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కోరారు.


మంగళవారం ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ కూడలి వద్ద నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గవర్నమెంట్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లతో అన్ని ప్రదేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11.30 గంటలకు జనగణమన గీతాన్ని ఆలపించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవలి ప్రెస్ మీటల్ లోనే పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం పోలీసు శాఖ పర్యవేక్షణ బాధ్యత చూస్తోంది.


నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు


అంతేకాక, హైదరాబాద్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.30 దాకా భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం తర్వాత కూడా ట్రాఫిక్‌ జామ్‌ కష్టాలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. లిబర్టీ, బషీర్‌ బాగ్‌, జగ్జీవన్‌ రామ్‌ జంక్షన్‌, కింగ్‌ కోఠి, అబిడ్స్‌లో భారీగా ఆంక్షలు ఉండనున్నాయి. కాబట్టి, ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ ట్రాఫిక్‌ డైవెర్షన్స్ వల్ల ఇతర రూట్లలోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.


మరోవైపు, కోఠిలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఐదు వేల మంది విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు అన్ని ట్రాఫిక్‌ కూడళ్లలో నిమిషం పాటు రెడ్‌ సిగ్నల్‌ పడనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలా చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్ అవుతోంది.


మళ్లింపులు ఇలా


లిబర్టీ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను అబిడ్స్ వైపు అనుమతించరు. వాటిని హిమాయత్ నగర్ - నారాయణ గూడ - కాచిగూడ నుంచి కోఠికి మళ్లిస్తారు. కింగ్ కోఠి నుంచి అబిడ్స్ మెయిన్ రోడ్డు వైపు వచ్చే వాహనాలను కింగ్ కోటి ఎక్స్ రోడ్స్ - హనుమాన్ తెక్డీ - ట్రూప్ బజార్ - కోఠి వైపు మళ్లించనున్నారు. 


ఎంజే మార్కెట్, జాంబాగ్ నుంచి అబిడ్స్ వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డుకు మళ్లించనున్నారు. ఈ క్రమంలో సోమాజిగూడ, ఖైరతాబాద్, రవీంద్రభారతి జంక్షన్, అసెంబ్లీ, ఎల్బీ స్టేడియం, బీజేఆర్ స్టాట్యూ, లిబర్టీ, హిమాయత్ నగర్, జీపీఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ మరింతగా ట్రాఫిక్ సమస్య ఏర్పడనుంది.