హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మధ్యే వాగ్వివాదం చోటు చేసుకుంది. నగర మేయర్‌ విజయలక్ష్మికి ఇందులో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ దగ్గర స్థానిక ఎమ్మెల్యే వర్గానికి మేయర్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఉప్పల్ వద్ద ఉన్న చిలుకానగర్‌ డివిజన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే లేకుండా ఎలా శంకుస్థాపన చేస్తారంటూ స్థానిక బీఆర్ఎస్‌ నేతలు మండిపడ్డారు. 


దీనిపై స్పందించిన మేయర్ ఆయనతో తనకు ఏం సంబంధమని ఎదురు సమాధానం ఇచ్చారు. దీంతో మేయర్‌ తో బీఆర్‌ఎస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్‌ పాటించడంలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే వారికి గట్టిగా సమాధానం చెప్పిన మేయర్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో అక్కడి నుంచి వెనక్కి వచ్చేశారు.