Hyderabad News: మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 16 మందిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ జాయింట్ ఆపరేషన్ లో 16 మందిలో 11 మంది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన వారు కాగా.. మిగతా ఐదుగురు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. తాజాగా వారి వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు.


అరెస్టయిన వారిలో ఓ మెడికల్ కాలేజీ హెచ్ఓడీ మహ్మద్ సలీమ్, ఓ పేరుపొందిన ఎంఎన్సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న అబ్దుల్ రెహ్మాన్, పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్న షేక్ జునైద్ లను అరెస్టు చేశారు. రోజు వారీ కూలీలు మహ్మద్ అబ్బాస్, హమీద్ లను పోలీసులు అరెస్టు చేశారు. మరో రోజు వారి కూలీ మహ్మద్ సల్మాన్ పరారీ ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారికి హిజ్భ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని నిఘా సంస్థలు గుర్తించాయి. అరెస్టైన వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కత్తులు, అలాగే ఇస్లామిక్ జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.


మధ్యప్రదేశ్ పోలీసుల సమాచారం - జాయింట్ ఆపరేషన్                   


మధ్యప్రదేశ్ పోలీసులకు అందిన స్పష్టమైన సమాచారంతో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా వీరు కొన్ని ఉగ్రవాద సంస్థల వ్యవహారాలపై ఆకర్షితులై.. ఆయా సంస్థల్లో చేరాలన్న పట్టుదలతో గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమనిస్తున్నారు. గతంలో ఇలాగే హైదరాబాద్‌ నుంచి కొంత మంది సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కొంత మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ వంటి  సంస్థలు పట్టుకున్నాయి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఐసిస్‌తో పాటుఇతర ఉగ్రవాద సంస్థలు బలహీనపడ్డాయి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కూడా ఇలాంటి వార్తలు తగ్గిపోయాయి. హఠాత్తుగా ఇప్లుడు ఏకంగా పదహారు మందిని అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. 


గత ఏడాది ఏప్రిల్‌లో ఐసిస్ సానుభూతి పరుడు అరెస్ట్               


గత ఏడాది ఏప్రిల్‌లో  ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిని అరెస్ట్ చేశారు.  పాతబస్తీకి చెందిన సులేమాన్ అనే ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ కు మద్దతుగా, ఐసిస్ భావజాలాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్ పేరుతో 20 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా పోలీసులు సులేమాన్ ను అరెస్ట్ చేశారు. దేశంలో ఐసిస్ కదలికల్ని నాలుగు రోజుల క్రితం గుర్తించాయి భద్రతా బలగాలు. ఈనేపథ్యంలో హైదరాబాద్ లో సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఐసిస్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అమెరికాకు వ్యతిరేఖంగా ఐసిస్ తరుపున యుద్ధం చేయాలంటూ.. కామెంట్స్ పెడుతున్నాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా దేశంలో ఐసిస్ మాడ్యూల్స్ ఉన్నాయన్న అనుమానంతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు.