HCL Tech Center In Hyderabad: హైదరాబాద్లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్, దావోస్లో రేవంత్ రెడ్డితో ఒప్పందం - 5000 ఉద్యోగాలు కన్ఫామ్
Telangana News | 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో హెచ్సీఎల్ కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఒప్పందం కుదిరింది.

Revanth Reddy at Davos | దావోస్/ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం దావోస్ లో మరో కీలక ఒప్పందం చేసుకుంది. అటు రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు ఇటు యువతకు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ (HCL Technologies) హైదరాబాద్ లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్తో తాజాగా చర్చలు జరిపారు. హెచ్సీఎల్ కొత్త సెంటర్ (HCL Tech Center)లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, అత్యాధునిక క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్లను అందిస్తుంది.
3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో
3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీలోహెచ్సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ అందుకుంది. దీంతో దాదాపు 5,000 మంది ఐటీ రంగానికి చెందిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, ఐటీలో ప్రతిభా వంతులైన నిపుణులతో ఇప్పటికే హెచ్సీఎల్ (HCL) గ్లోబల్ నెట్ వర్క్ సెంటర్ గా హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కొత్త సెంటర్ మరింత అత్యాధునిక సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హెచ్సీఎల్ సేవల విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని హెచ్సీఎల్ ప్రతినిధులను తెలంగాణకు ఆహ్వానించారు.
స్థానిక యువతకు ఉద్యోగాలతో పాటు హైదరాబాద్లోని టెక్నాలజీ, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని హెచ్సీఎల్ టెక్ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని చెప్పారు.
2007 నుంచే హెచ్సీఎల్ హైదరాబాద్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలను అందిస్తోంది. కొత్త కేంద్రంతో హైదరాబాద్ లో హెచ్సీఎల్ మొత్తం అయిదు సెంటర్లను విస్తరించనుంది.