Bhatti Vikramarka About New Ration Cards in Telangana | హైదరాబాద్: అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందాలని, అందుకోసం అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభలు, వార్డు సభలను ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో భట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు భట్టి విక్రమార్క. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కొనసాగుతున్న గ్రామసభలలో ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, వారి నుంచి వస్తున్న అభ్యంతరాలపై భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ఫలాలు అందాలి. అందుకు అధికారులు కృషి చేయాలి. కొత్త రేషన్ కార్డులు (Telangana Ration Cards), రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలపై నిర్వహిస్తున్న సభలలో జాబితా వివరాలను చదివి వినిపించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. 

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

రేషన్ కార్డులు రాలేదని ఆందోళన చెందవద్దన్న భట్టి విక్రమార్క.. వీటి జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు, వివరాలు రానివారు గ్రామసభలు (Grama Sabha) / వార్డు సభలు, ప్రజా పాలన సేవా కేంద్రాలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జనవరి 24 వరకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ/వార్డు సభలో అర్హులుగా ఉండి జాబితాలో పేర్లు లేని వారు సైతం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Housing Scheme) అర్హుల జాబితాను సభలలో చదివి వినిపించడంతో పాటు అర్హుల జాబితాలో పేర్లు రాని వారి నుంచి తాజాగా దరఖాస్తులు స్వీకరించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

అభ్యంతరాలు స్వీకరణ

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం మొదటి రోజు 93 గ్రామ సభలు, 24 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సభలలో అర్హుల జాబితా చదివి వినిపించి జాబితాలో లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ / వార్డు సభల నిర్వహణకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుని, జాబితాపై పేరు లేని వారి నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Also Read: Fact Chek KCR News: కేసీఆర్ అమెరికాలో సెటిల్ అవుతున్నారా..? ఆ పేరుతో వస్తున్న న్యూస్ క్లిప్‌లు నిజమేనా.. ?