Hayat Nagar Minor Girl Gang Rape Case: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ లో ఓ మైనర్ బాలికపైన జరిగిన సామూహిక అత్యాచార ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బాలికపైన జరిగిన అఘాయిత్యం తీరు, ఆ ఘటన బయటకు వచ్చిన విధానం విస్మయం కలిగిస్తోంది. బాలికను బెదిరించిన తీరు, ఆ ఘటన బయటకు వచ్చిన తీరు మొత్తం నాటకీయ పరిణామాల తరహాలో చోటు చేసుకున్నాయి. పదో తరగతి చదువుతున్న బాలురు ఈ అఘాయిత్యానికి పాల్పడిన తీరు కూడా వారి మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందో చాటుతోంది.


ఈ అత్యాచార ఘటన గురించి పోలీసు అధికారులు ఏబీపీ దేశంతో వెల్లడించిన వివరాల ప్రకారం.. హాయత్ నగర్ లోని ఓ గవర్నమెంట్ స్కూలులో బాధిత బాలికతో పాటు, ఐదుగురు బాలురు పదో తరగతి చదువుతున్నారు. గత ఆగస్ట్ నెలలో 15వ తేదీన జెండా వందనం కార్యక్రమం తరవాత బాలిక వాష్ రూంకి వెళ్ళింది. అదే సమయంలో తనని ఫాలో అయిన మిగతా ఐదుగురు బాలురు బాలికతో సున్నితంగా మాట్లాడుతూ అత్యాచారం చేశారు. ఘటన తర్వాత ఎవరితో అయిన చెబితే ఈ వీడియోని అందరికి చూపించడంతో పాటు సోషల్ మీడియాలో పెడతామంటూ భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో బాలిక ఎవరికి చెప్పకుండా ఉంది.


పది రోజుల తర్వాత మరోసారి


ఘటన జరిగిన మరో 10 రోజుల తరువాత బెదిరించి బాలికపై మరోసారి బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్ళీ సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అయితే ఐదో బాలుడికి అవకాశం ఇవ్వలేదని కోపంతో ఆ వీడియోలను ఏకంగా 50 మందికి పంపాడు. అలా వైరల్ అయిన వీడియో బాధిత తల్లిదండ్రుల ఫోన్‌కి కూడా వచ్చింది. దీంతో బాలికను తల్లి నిలదీసి అడగగా బాలిక జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. న్యాయం కోసం స్థానిక కార్పొరేటర్ ను, పెద్దలను ఆశ్రయించినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాలికను బాలకల వసతి గృహంలో చేర్చారు.


దిగ్భ్రాంతి కలిగించేలా బాలుర మానసిక స్థితి


పదో తరగతి చదువుతున్న బాలురి దురాలోచనలు, మానసిక స్థితి ఈ స్థాయిలో ఉండడం చూసి పోలీసులు, ఈ ఘటన గురించి తెలిసిన వారు సైతం దిగ్భ్రమ చెందుతున్నారు. అంతటి క్రూరమైన ఆలోచనలు ఆ 15 ఏళ్ల వయసులో రావడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆ ఐదుగురు బాలురు ఎప్పటి నుంచి స్నేహితులు, వారు కలిసి ఇంతకుముందు ఏమేం చేస్తుండేవారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా, ఐదో విద్యార్థి అంతటి అక్కసు పెంచుకొని, ఏమీ ఆలోచించకుండా అత్యంత సున్నితమైన ఆ వీడియోను 50 మందికి పంపేయడం కూడా పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితులపై CR.NO.1266/2022, 449, 376  POCSO చట్టం-2012 లోని పలు సెక్షన్లు, ఐటీ చట్టం-2000 ప్రకారం 67A, 67B  కింద కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశారు.