Haritha Haram 2022: స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్యేకంగా తెలంగాణ‌కు హరిత‌హారం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందులో ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొని కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని మంత్రి  కోరారు. బుధ‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లా అటవీ అధికారులు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల‌తో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. 


మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ కూడా!


ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... స్వతంత్ర‌ భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలంతా పులకరించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లోని సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. న‌ర్స‌రీల్లో మొక్క‌ల ల‌భ్య‌త‌కు అనుగుణంగా  మొక్క‌లు నాటే విధంగా చూడాల‌న్నారు. మొక్క‌లు నాట‌డ‌మే కాకుండా నాటిన మొక్క‌లను సంర‌క్షించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి వివరించారు. అన్ని శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని  కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిల‌ను సిద్ధం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. మున్సిపాలిటీల్లో ఎక్కువ మొక్క‌లు నాటేలా ప్రాధ‌న్య‌త‌ ఇవ్వాల‌న్నారు.  


19054 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా..


హ‌రిత‌హ‌రంలో ఇప్ప‌టి వ‌రకు 264 కోట్ల మొక్క‌లు నాటామ‌ని, ఎనిమిద‌వ విడ‌త హరిత‌ హారంలో 19. 54 కోట్ల మొక్క‌లు నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన ఈ కార్య‌క్రమంతో లక్ష్యానికి మ‌రింత చేరువ‌వుతామ‌ని చెప్పారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొత్తం 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఈ క్రమంలోనే ఏడో విడద హరిత హారంలో భాగంగా 20 కోట్ల మొక్కలను నాటామన్నారు. ఏడు విడదత హరిత హారం విజయవంతమైన స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో కూడా అందరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి తెలిపారు. 


ప్రతీ ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలి..


అనంత‌రం అట‌వీ శాఖ స్పెష‌ల్ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ... స్వతంత్ర‌ భారత వజ్రోత్సవాల సంద‌ర్భంగా మొక్క‌లు నాటే  అద్భుత‌మైన అవ‌కాశం వ‌చ్చింద‌ని.. ప్రతీ ఒక్కరూ ఇందులో పాల్గొనాలని సూచించారు. అలాగే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమంలో మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే హరిత హారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 53 పూర్తి కాగా అందులో 53 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 56 అర్బన్ పార్కులను ఈ ఏడాది చివరకల్లా పూర్తి చేయనున్నారు. అటు ప్రభుత్వ గుర్తింపు పొందిన లే అవుట్లలోనూ పచ్చదనం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.