హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ నివాసంలో భద్రతా లోపంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నివాసంలోకి వ్యక్తి చొరబడడం రాష్ట్రంలోని మహిళలకు భద్రతలో ఉన్న లోపాన్ని బహిర్గతం చేసిందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి భార్య అయిన సీనియర్ ఐఎఎస్ అధికారిని నివాసంలోకి ఒక వ్యక్తి నిర్భయంగా ప్రవేశించగలిగితే,  రాష్ట్రంలోని ఒక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.


పాలనా లోపాన్ని ఎత్తి చూపిన ఘటన 
రాష్ట్రంలో పాలనా లోపాన్ని ఈ ఘటన ఎత్తి చూపుతుందని, ప్రతి రోజూ కనీసం ఒక కేసు నమోదవుతున్నప్పటికీ మహిళలపై నేరాలపై సమీక్ష జరగడం లేదని అన్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి భయభ్రాంతులకు గురిచేశారని నారాయణరెడ్డి అన్నారు. ఆమె భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసి ఆగంతకుడిని పట్టుకునేల ధైర్యాన్ని ప్రదర్శించిందని అన్నారు. తెలంగాణ పోలీసులు రూపొందించిన నివేదిక ప్రకారం 2022లో తెలంగాణలో మహిళలపై నేరాల పరిస్థితి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3.8 శాతం పెరిగిందని గూడూరు నారాయణ రెడ్డి చెప్పారు.


2022లో 17,908 కేసులు నమోదయ్యాయని, 2021లో 17,253 కేసులు నమోదయ్యాయని, 2022లో మహిళలపై జరిగిన మొత్తం నేరాల్లో 9,071 కేసులు వరకట్న వేధింపుల కింద నమోదయ్యాయని, 4,964 కేసులు  అగౌరవపరిచేలా నమోదయ్యాయని చెప్పారు. అత్యాచారం కింద 2,126, హత్య కింద 181, వరకట్న మరణాల కింద 126, వరకట్న హత్య కింద 40 కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళలపై నేరాల సంఖ్య 2021లో 7,459 నుండి 2022 నాటికి 7,578కి పెరిగిందని వాటిలో అట్రాసిటీ కింద 984 కేసులు, కిడ్నాప్ కింద 360 కేసులు నమోదయ్యాయని అన్నారు గూడూరు నారాయణ రెడ్డి.


మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు తగ్గడం లేదు


తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెబుతున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలు తగ్గుముఖం పట్టడం లేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయని గూడూరు అన్నారు. ప్రతి రోజు వార్తా దినపత్రికలు మహిళలపై నేరాలు లేదా అఘాయిత్యాలను ఒకటి కంటే ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నాయని ఆయన అన్నారు. 5 ఏళ్లలోపు ఆడపిల్లలు కూడా అఘాయిత్యాలకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. అనేక చోట్ల మహిళలను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారని చెప్పారు. దిశా కేసు మహిళలపై నేరాలు మరియు అఘాయిత్యాలపై  దృష్టి సారించినప్పటికీ, ఆ ప్రాంతంలో ఎటువంటి మెరుగుదల లేదని అన్నారు.


"రాష్ట్ర ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ అధికారి నివాసంలో భద్రతా ఉల్లంఘన జరిగితే, దుడ్డంగులు అడ్డంకులు లేకుండా నివాసంలోకి ప్రవేశిస్తే, రాష్ట్రంలో ఒంటరి మహిళలు మరియు బాలికల భద్రత ఏమిటి?" అని ఆయన ప్రశ్నించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారని.. అలాంటప్పుడు రాష్ట్రంలోని మహిళల భద్రతకు సీఎం ఎలా హామీ ఇస్తారు? చెప్పాలని గూడూరు నారాయణ రెడ్డి అన్నారు.


అసలేం జరిగింది?


 తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్... హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే ఆమె చేసిన ట్వీట్లకు ఓ డిప్యూటీ తహసీల్దార్ ఒకరి రెండు సార్లు రీట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం రాత్రి 11.30 గంటల సమయంలో కారులో నేరుగా ఆమె ఉండే నివాస సముదాయానికి వెళ్లాడు. తన స్నేహితుడైన హోటల్ యజమానిని అతని వెంటతీసుకెళ్లాడు. తాను ఫలానా క్వార్టర్ కు వెళ్లాలని కాపలా సిబ్బందికి జంకు లేకుండా చెప్పడంతో అనుమానించని వారు లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. స్నేహితుడిని కారులోనే ఉంచి డిప్యూటీ తహసీల్దార్ మాత్రం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ముందు ఉన్న స్లైడింగ్ డోర్ ను తెరుచుకొని లోపలికి ప్రవేశించి గది తలుపు కొట్టాడు. డోర్ తెలిచిన మహిళా ఐఏఎస్ కు అంత రాత్రి సమయంలో ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో తీవ్రంగా భయపడిపోయారు. తేరుకున్న ఆమె, నువ్వెవరు, ఎందుకొచ్చావని అని గట్టిగా ప్రశ్నించింది. అందుకు అతను గతంలో నేను మీకు ట్వీట్ చేశానని.. తన ఉద్యోగం గురించి మాట్లేందుకు వచ్చానని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గుర్తైన ఆమె బయటకి వెళ్లాలని చెబుతూ కేకలు వేసినట్లు సమాచారం. ఈలోపే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కారును జప్తు చేసిన పోలీసులు.. డిప్యూటీ తహసీల్దార్ తో పాటు అతడి స్నేహితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.