Honor Killing in Hyderabad: హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ పరువు హత్య ఘటనపై గవర్నర్‌ జోక్యం చేసుకున్నారు. నాగరాజు దారుణ హత్యపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా గవర్నర్ దీనిపై స్పందించారు. మతాంతర వివాహం కాబట్టి ప్రభుత్వం నుంచి హత్యపై వివరణాత్మక నివేదికను గవర్నర్ తమిళి సై కోరారు.


అసలేం జరిగిందంటే? 
యువతి యువకుడు ప్రేమించుకున్నారు. వారిద్దరి మతాలు వేరు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. లైఫ్‌ సెటిల్ య్యారు. ఇక లైఫ్‌ అంతా హ్యాపీ అనుకుంటుండగా పరువు పగపట్టింది. అన్యోన్యంగా ఉంటున్న టైంలో పిడుగులాంటి ఘటన జరిగింది. సరూర్‌ నగర్‌ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటన కలకలం రేపింది. బుధవారం (మే 4) రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కొత్త జంటపై దాడి జరిగింది. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే అతి కిరాతకంగా ఓ వ్యక్తి ఆజంటపై దాడి చేశాడు. చేతిలో ఉన్న గడ్డపారతో కొట్టాడు. ఈ దుర్ఘటనలో భర్త అక్కడికక్కడే చనిపోయాడు.


రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ వాసి ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆశ్రిన్‌ బంధువులు నాగరాజును హెచ్చరించారు. ఆమె వెంట తిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాన్ని గ్రహించిన నాగరాజు హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కున్నాడు. ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా చేరాడు. స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆశ్రిన్‌కు చెప్పాడు.


అనుకున్నట్టుగానే లైఫ్‌లో స్థిరపడ్డ తర్వాత ఆశ్రిన్‌కు కబురు పెట్టాడు. జనవరిలో ఇంట్లో చెప్పకుండా ఆశ్రిన్ హైదరాబాద్‌ వచ్చేసింది. ఆర్య సమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తమ జాడ ఆశ్రిన్‌ బంధువులకు తెలియకుండా ఉండేందుకు ఉద్యోగం, నివాసాన్ని కూడా మార్చేశారు. ఆశ్రిన్, నాగరాజు ఎన్ని ప్లేస్‌లు మారుతున్నా ఆమె బంధువులు వదల్లేదు. వెంటాడుతునే ఉన్నారు. రక్షణ కల్పించాలంటూ పెళ్లికి ముందు ఓ సారి వికారాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు.


వివాహం చేసుకున్నాక తొలుత బాలానగర్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. అమ్మాయి తరపు వారు ఆచూకీ కనుక్కోవడంతో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కోసం పెళ్లి తర్వాత బాలానగర్‌ పోలీసులను వీరు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే బుధవారం నాగరాజు, ఆశ్రిన్‌ దంపతులు బైక్‌పై ముసారాంబాగ్‌ వెళ్లారు. తిరిగి ఈ జంట ఇంటికి వస్తున్న సమయంలో కొందరు బైక్‌ను అడ్డగించి నాగరాజుపై దాడి చేసి చంపారు. ఈ పరువు హత్య సంచలనమైంది.