ఎన్నారై సంబంధాలు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంబంధాలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉందని తెలిసిందే.  ప్రస్తుతం ఎన్నారైలను వివాహం చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ఎన్నారైలను మ్యారేజ్ చేసుకుంటున్న యువతి, యువకులు కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వరుడు లేక వధువుకు సంబంధించిన వివరాలు, వారి కుటుంబసభ్యులు, అడ్రస్ సహా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ పెళ్లికి ముందే సేకరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ వివాహం ఎన్నారైతో జరుగుతుందా అయితే మీ తల్లిదండ్రులు కచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. ఈ మేరకు కొన్ని పత్రాల వివరాలను ట్వీట్ చేశారు.


Getting Married to AN NRI? ఎన్నారైని వివాహం చేసుకుంటున్నారా అయిదే ఇది తెలుసుకోండి అంటూ సైబరాబాద్ పోలీసులు కొన్ని వివరాలతో ఓ వీడియో షేర్ చేశారు. ఎన్నారైని పెళ్లి చేసుకోబోయే వధువు లేక వరుడుతో పాటు వారి తల్లిదండ్రులు.. కాబోయే అల్లుడు లేక కోడలుకు సంబంధించి వీసా, పాస్ పార్ట్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, గత మూడేళ్లుగా చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు, విదేశాలలో నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన అడ్రస్ ప్రూఫ్ లాంటివి కచ్చితంగా పెళ్లికి ముందే తీసిపెట్టుకోవాలని సైబరాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. ఎన్నారైలను వివాహం చేసుకుని భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలాంటి డాక్యుమెంట్స్ సేకరించి మీ వద్ద ఉంచుకోవాలని ఎన్నారై మ్యారేజ్ చేసుకునే వారికి సూచించారు.






ఎన్నారై తో వివాహం - కుమారుడు పుట్టిన తర్వాత అదనపు కట్న వేధింపులు
తిరుపతికి చెందిన కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజల కుమారుడు  సిద్దేశ్వర్  అమెరికాలో స్ధిర పడ్డాడు. అతడికి 2014లో గూడూరుకు చెందిన ఓలేటి సోనీని ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం భార్య సోనీని అమెరికాకు తీసుకెళ్లాడు సిద్దేశ్వర్.  2015లో సోనీ మగా శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత ఇండియాకు వచ్చినప్పుడు  సోనీని అమ్మగారి ఇంటికి పంపాడు సిద్దేశ్వర్.. ఇండియాకి వచ్చిన కొన్నాళ్ళు బాగానే మాట్లాడమే కాకుండా, వీడియో కాల్స్ తో కొడుకు, భార్యపై ఆప్యాయత చూపేవాడు. అదనపు కట్నం కోసం వేధించగా.. పెళ్లి సమయంలో కేజీ బంగారం, 10 కేజీల వెండి, 12 లక్షల నగదు ఇచ్చారు, 50 లక్షలు పెట్టి పెళ్లి చేస్తే ఇంకా ఏం అడగమంటావ్ అని సోనీ ఎదురు తిరిగింది. రెండో పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటుండగా ఆమె, తన తల్లిదండ్రులతో కలిసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. 


కాబోయే ఎన్నారై భర్త పాడుపని.. సూసైడ్ చేసుకున్న యువతి
ఎన్నారై సంబంధాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చాటే ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన అనంతరం యువకుడు ప్రవర్తించిన తీరును తట్టుకోలేక యువతి తీవ్ర ఒత్తిడికి లోనై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట్లో అంతా బాగున్నా, కట్న కానుకల విషయంలో కుదరక పెళ్లి సంబంధం క్యాన్సల్ కావడంతో ఎన్నారై కార్తీక్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. తన వద్ద వీడియోలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఎన్నో ఘటనలతో పోలీసులు ఎన్నారై సంబంధాలపట్ల జాగ్రత్తలు సూచించారు.