దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏ రాజకీయ నాయకుడైన సరే పార్టీ మారితే, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సిటిజన్‌ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న ఆయన, యువత రాజకీయాల్లోకి రావడం ద్వారా భవిష్యత్ తరాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. 


ప్రస్తుత రాజకీయాల్లో కోట్లు లేనిదే ఓట్లు రావనే పరిస్థితి ఏర్పడిందన్నారు వెంకయ్య నాయుడు. ఇది మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భుజంమీద కండువా మార్చినంత సులభంగా నేతలు పార్టీలు మారుతున్నారని అన్నారు. పాలిటిక్స్ లోకి రావడానికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదన్న వెంకయ్య నాయుడు, అందులో రాణించడానికి మాత్రం అధ్యయనం చేయాలని సూచించారు. సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చట్టసభల్లో అర్ధవంతమైన చర్చలు జరిపి, ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని సూచించారు. 


 


ఈ మధ్య కక్షసాధింపు రాజకీయాలపై సెటైర్లు


అధికారం శాశ్వతం కాదని, ప్రత్యర్థులను వేధించొద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్.. రాజ్యసభ, శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఈ సభకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై.. సమకాలీన రాజకీయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండకూడదని సూచించారు. దుర్భాషలాడే నేతలకు ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు.


ద్వేష పూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొంత మంది నేతలు నోరు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్నీ అసభ్య పదాలేనని వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిని ప్రజలు గమనించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఓటు వేయాలని సూచించారు.


'10 శాఖలకు మంత్రిగా ఉండీ మచ్చ లేకుండా కొనసాగారు'


అసభ్యంగా మాట్లాడేవారికి పోలింగ్ బూత్‌లో సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. తాను, దివంగత జైపాల్‌రెడ్డి ముఖ్యమంత్రులపై ఎన్ని విమర్శలు చేసినా అవి విషయానికి లోబడే ఉండేవని, ఇప్పుడు ఆ స్థాయి విమర్శలను సహించే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్‌‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. దేవేందర్ గౌడ్ ఆదర్శవంతమైన నాయకుడన్న ఆయన.. పది శాఖలకు దేవేందర్ గౌడ్ మంత్రిగా పని చేసినా ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగారని అన్నారు. పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాలను తీసుకొచ్చినట్టు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దేవేందర్ గౌడ్ చేసిన ప్రసంగాలు, సభ్యుల ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలతో తీసుకువచ్చిన ఈ పుస్తకాలను చదివినప్పుడు, వారు ఎంత హుందాగా, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించారో అర్థం అవుతుందని అన్నారు.









'ఉప రాష్ట్రపతి కంటే వెంకయ్య నాయుడుగా నన్ను గుర్తిస్తేనే నాకు ఎక్కువ ఆనందం. ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను. ప్రజా జీవనంలో ఉన్నాను. పార్టీలు, రాజకీయాలపై వ్యాఖ్యానించను. ఎప్పుడూ పార్టీని చూడొద్దు. విషయాన్ని, ప్రాధాన్యతను చూడాలి. వెనకబడిన వర్గాల కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. రాజకీయాల కోసం కాదు.. ప్రజా సంక్షేమం కోసం పాటు పడ్డ వ్యక్తి ఎన్టీఆర్. దేవేందర్ గౌడ్ తన విలువైన అనుభవాలను పుస్తక రూపంలోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసహప్యంగా ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నాయకులను ఎన్నుకోవాలి. సత్తా ఉన్న నాయకులను ఎంచుకోవాలి. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. దేశంలో, రాష్ట్రంలో గట్టి ప్రతి పక్షం ఉండాలి. బలమైన ప్రతి పక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది' అని వెంకయ్య నాయుడు చెప్పారు.