KCR Latest News: సంపన్నంగా ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంల చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో రామగుండం నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అది కూడా సింగిల్గానే అధికారం సాధిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వాళ్లు కాదని తెలిపారు. బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
ఎప్పటికీ తెలంగాణ కోసం పోరాటం చేసేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. అందుకే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే సమస్యలు చుట్టు ముట్టాయని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. రామగుండంలో పరిస్థితులుపై మాట్లాడిన కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలని ఆకాంక్షించారు. ఒకనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని తర్వాత ఇందిరాగాంధీ మోసం చేశారని ఆరోపించారు. చాలా విషయాల్లో కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా తాను వెనకడుగు వేయలేదన్నారు. భవిష్యత్లో చాలా పోరాటాలు చేయాలని అందుకే ప్రతి ఒక్కరూ కేసీఆర్ మాదిరి సిద్ధమవ్వాలని సూచించారు. తెలంగాణ హక్కుల కోసం నిలబడాలని పేర్కొన్నారు.