Telangana Congress: తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన కమిటీల ఏర్పాటు చేయలేకపోయారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్ని రోజుల నిరీక్ష ఫలించింది. ముందుగా పార్టీలో కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముందుగా ఐదు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ ముందడుగు వేసింది. దీంతో మిగతా వాటిపై కూడా ఆసక్తి ఏర్పడింది. 

22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15మందితో అడ్వైజరీ కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్‌ కమిటీ, 16మందితో సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణా చర్యల కమిటీ ఏర్పాటు చేస్తూ జాబితాలను ప్రకటించింది. గురువారం రాత్రి ఈ వివరాలు వెల్లడించింది. 

తెలంగాణలో తొలిసారిగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇటు పార్టీ, అటు ప్రభుత్వానికి సమన్వయం చేసుకుంటూ నడుస్తున్న వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ సహాయపడుతుంది. ఇందులో 15 మంది సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు మంత్రులు ఉంటారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సారథ్యం వహిస్తారు. 

మీనాక్షి నటరాజన్‌తోపాటు సీఎం రేవంత్‌ రెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, వి.హనుమంతరావు, జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్‌, జి.చిన్నారెడ్డి, జె.గీతారెడ్డి, ఎం. అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జయప్రకాశ్‌ రెడ్డి, జాఫర్‌ జావేద్‌, టి. జీవన్‌ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్‌ ఈ అడ్వైజరీ కమిటీలో ఉంటారు. 

కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, చల్లా వంశీచంద్‌ రెడ్డి, జి.రేణుకా చౌదరి, బలరాం నాయక్‌, డి. శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, షబ్బీర్‌ అలీ, అజహరుద్దీన్‌, ఆది శ్రీనివాస్‌, శ్రీహరి ముదిరాజ్‌, బీర్ల ఐలయ్య, పి.సుదర్శన్‌ రెడ్డి, కె.ప్రేమ్‌సాగర్‌ రావు, జెట్టి కుసుమ్‌ కుమార్‌, ఎరవర్తి అనిల్‌ కుమార్‌ సభ్యులుగా ఉన్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ఉంటారు. క్యాబినెట్‌ మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

డీలిమిటేషన్‌ కమిటీకి చల్లా వంశీచంద్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఇందులో గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, డా. శ్రవణ్‌ కుమార్ రెడ్డి, పవన్‌ మల్లాది, డి.వెంకటరమణ సభ్యులుగా ఉంటారు. 

సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీకి పి. వినయ్‌ కుమార్‌ ఛైర్మన్‌గా ఉంటారు. ఇందులో అద్దంకి దయాకర్‌, కె.శంకరయ్య, ఎన్‌.బాలు నాయక్‌, ఎ.నర్సిరెడ్డి, ఆత్రం సుగుణ, రాచమళ్ల సిద్ధేశ్వర్‌, సంతోష్‌ కొలకొండ, డా.పులి అనిల్‌ కుమార్‌, జూలూరి ధనలక్ష్మి, మజీద్‌ ఖాన్‌, జి.రాములు, అర్జున్‌ రావు, శౌరి, కొల్లం వల్లభ్‌ రెడ్డి, వి.శ్రీకాంత్‌ రెడ్డి సభ్యులుగా ఉంటారు. 

క్రమశిక్షణా చర్యల కమిటీకి ఛైర్మన్‌గా ఎంపీ మల్లు రవి వ్యవహరిస్తారు. వైస్‌ ఛైర్మన్‌గా ఎ.శ్యామ్‌ మోహన్‌ ఉంటారు. సభ్యులుగా ఎం.నిరంజన్‌ రెడ్డి, బి.కమలాకర్‌రావు, జాఫర్‌ జావేద్‌, డా.జీవీ రామకృష్ణ ఉన్నారు.