TSPSC Paper Leakage Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. పేపర్ లీక్ పై సిట్‌తో పాటుగా ఈ అంశంలో ఈడీ కూడా విచారణ చేయబోతుంది. ఎగ్జామ్ పేపర్స్ లీక్ స్కా్మ్‌లో హవాలా ద్వారా  డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అరెస్టు అయిన 15 మందిని తిరిగి ఈడీ విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైన పక్షంలో టీఎస్పీఎస్సీ సభ్యులతో పాటు సెక్రెటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


మొత్తానికి తెలంగాణలో ఈడీ దూకుడు పెంచుతోంది. రెండు ముఖ్యమైన కేసులపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు డాటా లీక్ పైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో బ్యాంకులతోపాటు పలు సంస్థలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ–కామర్స్, ఐటీ కంపెనీలు వినియోగదారుల సమాచారంలో గోప్యత, భద్రత పాటించకపోవడం వల్లే డేటా లీకైనట్టు సైబరాబాద్‌ పోలీసులు నిర్ధారించారు. బిగ్‌ బాస్కెట్, ఫోన్‌ పే, ఫేస్‌బుక్, క్లబ్‌ మహీంద్రా, పాలసీ బజార్, అస్ట్యూట్‌ గ్రూప్, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంకు, మాట్రిక్స్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంకు అఫ్‌ బరోడా సంస్థలకు సెక్షన్‌ 91 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.


దేశంలో 70 కోట్ల మంది ప్రజలు, సంస్థలకు చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని చోరీ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయనుంది. ఇప్పటికే 17 కోట్ల మంది డేటా లీకు కేసులో సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నితీశ్‌ భూషణ్‌ కుమార్, పూజా కుమారి, సుశీల్‌ తోమర్, అతుల్‌ ప్రతాప్‌ సింగ్, ముస్కాన్‌ హసన్, సందీప్‌ పాల్, జియా ఉర్‌ రెహ్మాన్‌లపై పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. 


తాజాగా దేశంలోని అతిపెద్ద డేటా లీకు కేసులో ప్రధాన సూత్రధారి వినయ్‌ భరద్వాజ్‌పై కూడా ఈడీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సాధారణ ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు డిఫెన్స్, టెలికాం, విద్యుత్, ఇంధనం, జీఎస్‌టీ లాంటి ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కీలక సమాచారాన్ని నిందితులు తస్కరించి, బహిరంగ మార్కెట్‌లో అమ్ముతున్నారు. 


ఆంధ్రపదేశ్, తెలంగాణతోపాటు 24 రాష్ట్రాలకు చెందిన ప్రజలు, గవర్నమెంట్ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని నిందితులు విక్రయానికి పెట్టినట్లుగా గుర్తించారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసులను సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తం చేశారు. వినయ్‌ భరద్వాజ్‌ ఏడాది కాలంగా ఫరీదాబాద్‌ కేంద్రంగా డేటా నిల్వ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇన్‌స్పైర్‌ వెబ్జ్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటివరకు 50 మందికి డేటాను అమ్మినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. ఏడాది కాలంగా నిందితులు డేటా చోరీ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా కూడా అతను ఎవరికీ దొరకకపోవడం గమనించదగ్గ విషయం.