హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డీఏవీ స్కూల్‌ వ్యవహారంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఘటన జరిగిన వెంటనే స్కూల్ అనుమతి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై స్కూల్‌ యాజమాన్యం, పేరెంట్స్ పోరాడారు. ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు స్కూల్ అనుమతులపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. 


ఇవాళ(అక్టోబరు 26) హైదరాబాద్ డీఈవో (జిల్లా విద్యాధికారి)తో స్కూల్ డైరెక్టర్లు భేటీ అయ్యారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని పేరెంట్స్ ఇచ్చిన వినతి పత్రాలను డీఈవోకు స్కూలు మేనేజ్‌మెంట్ అందజేసింది. 


స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌తో జరిపిన చర్చల్లో స్కూల్ యాజమాన్యంతోపాటు స్కూల్ పేరెంట్స్‌ కూడా ఉన్నారు. ఇప్పటికిప్పుడు స్కూల్ అనుమతి రద్దు చేస్తే విద్యార్థలు జీవితాలు అయోమయంలో పడతాయని పేరెంట్స్ వేడుకున్నారు. దీంతో స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు కమిషనర్ అంగీకరించారని సమాచారం. 


DAV యాజమాన్యం, పేరెంట్స్‌ వాదనలు, అభిప్రాయాలు తెలుసుకున్న విద్యా కమిషనర్‌.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో యాజమాన్యం నుంచి రాతపూర్వకంగా రిపోర్ట్ వచ్చిన తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపుతామని కమిషనర్ తెలిపారు. స్కూల్ రీ ఓపెన్‌కి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.


డీఏవీ ఘటన తర్వాత విద్యా శాఖ కార్యదర్శి అధ్యక్షతన మంత్రి సబిత అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై సబితా ఇంద్రారెడ్డితో ఈ కొత్త కమిటీ భేటీ కానుంది. బంజరాహిల్స్ డీఏవీ స్కూల్ (DAV School Incident) వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నివేదించనుంది.


బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూలు DAV School Incidentలో ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ డ్రైవర్‌ రజనీ కుమార్‌ (34) లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్కూలులో ప్రిన్సిపల్‌ రూమ్ సమీపంలోని డిజిటల్‌ తరగతి గదిలోనే ఆ డ్రైవర్ చిన్నారిపై లైంగిక దాడి చేసినా ప్రిన్సిపల్‌ మాధవి (56) నిరోధించలేకపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు ఆమెపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికీ స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.


ఈ ఘటనపై వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూల్ రద్దుతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరారు.