PM Modi Hyderabad Visit:

   రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రానికి వచ్చే అర్హత లేదని సీపీఎం, సీపీఐ నాయకులు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ రైతు బజారు దగ్గర.. మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం, సీపీఐ కుత్బుల్లాపూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో " మోడీ గో బ్యాక్" అని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనులకు టెండర్లు పిలిచిన నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, వందే భారత్ రైలు ప్రారంభానికి వచ్చిన మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. త్వరగా మీరు హైదరాబాద్ నుంచి వెళ్లిపోండంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 


ప్రధాని మోడీ హిట్లర్ పాలన కొనసాగిస్తున్నారు..!


ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో వివిధ రంగాల్లో అనేక అన్యాయాలు జరుగుతున్నాయన్నారు. అలాగే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రమాదకర ఫాసిస్టు నిరంకుశ హిట్లర్ పాలన  కొనసాగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు ఎలాంటి మేలూ జరగలేదని చెప్పారు. లాభం ఏమో కాని నష్టాలు వాటిల్లుతున్నాయని అన్నారు. రాజ్యాంగానికి దేశ సమైక్య, సమగ్రతలకు, లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థల విధ్వంసానికి బీజేపీ ప్రభుత్వం తలపెడుతుందన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వం విధ్వంసానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని దుయ్యబట్టారు. దేశంలో లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉక్కు, బొగ్గు, రైల్వే, విమానయానం, ఆయిల్ కంపెనీలు, నౌకాశ్రయాలు ఆఖరికి రక్షణ రంగంతో సహా అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసేలా చట్టాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రాష్ట్ర ప్రజలంతా మోడీ హైదరాబాద్ పర్యటనను వ్యతిరేకించాలి..!


మోసపూరిత కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని అమ్మివేస్తూ.. తిరిగి కార్పొరేట్లపై ఆధారపడి సార్వ భౌమత్వాన్ని కోల్పోయే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి, బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేయడం మూలంగా కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులను నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కాల రాస్తుందని అన్నారు. ఈ తరుణంలోనే  మోడీ గో బ్యాక్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ నాయకులు సత్యం, అంజయ్య దేవదానం, మల్లారెడ్డి, సునీల్ సీపీఐ మండల నాయకులు రాములు, హరినాథ్, స్వామి శ్రీనివాస్, అశోక్ రెడ్డి, రాము పాల్గొన్నారు.


ఈ నిరసన సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులను ముందస్తు అరెస్టు చేశారు.