Congress six guarantees for Telangana:
బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బేగంపేటలోని చిరాన్ పోర్ట్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన కమిటీ మూడోసారి సమావేశమైంది. ఈర్లపల్లి శంకర్, జంగయ్య యాదవ్, ఆడం సంతోష్, కేష్ యాదవ్ లతో పాటు తదితర కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 


ఎన్నికల వ్యూహాల రిపోర్టు వచ్చే వారం మాణిక్ ఠాక్రేకు అందిస్తామని, అధికార పక్షానికి దీటుగా మా వ్యూహాలు ఉంటాయన్నారు ప్రేమ్ సాగర్ రావు. తప్పకుండా తమ భాధ్యత నెరవేరుస్తామని చెప్పారు. తెలంగాణలో తుఫాన్ లా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోందన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పార్టీ హాయంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వడ్ల కొనుగోలు కేంద్రాలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఉన్నాయని, ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్ల కొనుగోలులో పెద్ద స్కాం జరుగుతోందని ఆయన ఆరోపించారు. 


కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని బంధులన్నీ ఇప్పుడు ఆగిపోయాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళల సాధికారత పూర్తిగా కుంటు పడింది. ఇందిరమ్మ ఇండ్లు తప్ప సీఎం కేసీఆర్ కొత్తగా ఇచ్చిన ఇండ్లేమి లేవని ప్రజలే చెబుతున్నారని ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తోంది కనుక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని, 75 నుంచి 80 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


ఢిల్లీ వర్సెస్ తెలంగాణ అనే హక్కు కేసీఆర్ కు లేదు. గతంలో పొత్తుల ద్వారా మేము కొంత దెబ్బ తిన్నాం, అయినా ఈసారి పక్క ప్రాణాలికతో ప్రజల్లోకి వెళతామన్నారు. అవసరం అనుకున్న వారితో మాత్రమే పొత్తులు ఉంటాయని, లెఫ్ట్ పార్టీలతో పొత్తులు అంశం అధిష్టానం చూసుకుంటదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలు విశ్వాసం కోల్పోయారు. బీఆర్ఎస్ అధినేతకు ఓటమి భయం పుట్టుకుoది.. కనుక వరస బెట్టి సభలు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.


ప్రేమ్ సాగర్ రావు ఇంకా ఏమన్నారంటే.. ‘రైతులకు పెద్ద పీట వేసిన పార్టీ కాంగ్రెస్ అని.. రాష్ట్రంలో 22 లక్షల కౌలు రైతులు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వoలో కౌలు రైతులు మోసపోయారు. తెలంగాణలో 54 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. కోటి ఎనభై లక్షల మంది పని చేసుకొని బతుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వారందరూ రోడ్డున పడ్డారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. దరిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా అందిస్తాం.


డిసెంబర్ 10 వరకు పోలింగ్ పూర్తి అయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమల్లోకి వస్తాయి. రాష్ట్రంలో కూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలబెడుతుంది. పార్టీ మా మీద పెద్ద భాధ్యత పెట్టింది. మా బాధ్యతలు తప్పకుండా నిర్వర్తిస్తాం. వచ్చేవారం మరోసారి సమావేశం అయ్యాక అధిష్టానికి రిపోర్ట్ అందిస్తాం. ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకు అవసరమయ్యే మ్యానిఫెస్టోను రూపొందిస్తాం. రైతులకు కచ్చితంగా మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ అని’ స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు.