Telangana Government New Program Prajapalana: తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 'ప్రజా వాణి' పేరుతో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తుండగా, పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. ప్రజాపాలన (Prajapalana)పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు, పది రోజుల పాటు ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy ) శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోనుంది. వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా కసరత్తు చేస్తోంది. ఆదివారం కలెక్టర్లతో జరిగే సమాశంలో ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు సమాచారం. జిల్లా అధికారులు గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజలతో మాట్లాడనున్నారు. తొలుత పది రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రజాపాలన నిర్వహించనుంది.  ఆ తర్వాత అవసరమైతే మరోసారి నిర్వహించడంపై ఆలోచన చేస్తోంది. ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించింది. రూ.500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2,500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. 


విశేష స్పందనతో


తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమీక్షలు, సమావేశాలతో బిజీగా ఉంటూనే, ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా పాలన అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రోజురోజుకో సరికొత్త కార్యక్రమాల్లో పాలన సాగిస్తూ.. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 'ప్రజా వాణి' నిర్వహిస్తున్నారు. ప్రజా భవన్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తొలి రోజు నుంచే విశేష స్పందన లభిస్తోంది. భూసమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల కోసం ప్రజలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ ప్రజా భవన్ కు వస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 'ప్రజా పాలన'కు శ్రీకారం చుట్టారు.


24న కలెక్టర్లతో సీఎం సమావేశం


సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న (ఆదివారం) అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులు, భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి తదితర పథకాల అమలుపై వారితో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై తగిన సమాచారంతో సమీక్షకు హాజరు కావాల్సిందిగా శుక్రవారం కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.


Also Read: Telangana News: బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల వాయిదా - ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కేటీఆర్