Kancha Gachibowli Land Dispute: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కంచ గచ్చిబౌలిలోని  400 ఎకరాల భూవివాదంలో కీలక అప్‌డేట్ ఇది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం జోక్యం చేసుకుంది. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర పర్యావరమ, అటవీ శాఖల సాధికార కమిటీ వచ్చింది. క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. 

సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటీ ఛైర్మన్‌ సిద్ధాంత దాస్‌తోపాటు మరో ఇద్దరు ఈ కమిటీలో ఉన్నారు. ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఈ కమిటీ విచారణ చేస్తోంది. . ఇవాళ రేపు కంచ గచ్చిబౌలి భూముల్లో తిరిగి పరిశీలించనున్నారు. అక్కడి వారితో కూడా మాట్లాడబోతున్నారు. ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. 

కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కడ జరుగుతున్న పనులు ఆపాలని ఆదేశించిన కోర్టు ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన పని స్టార్ట్ చేసింది. 

ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

3 ఏప్రిల్‌ 2025న సుప్రీంకోర్టు ఈ భూముల వివాదంలో కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాస్పద భూముల్లో చెట్లు నరికివేత, చదును చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. హైకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం కంచ గచ్చబౌలి భూముల్లో చెట్లు నరికివేసినట్టు తేలిందని ఇది చాలా సీరియస్ విషయమని అభిప్రాయపడింది.