TGPSC Group 1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్యే గ్రూప్ -1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. 963 ఉద్యోగాల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టింది. వీళ్లందరి సర్టిఫికేట్ల పరిశీలన నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. వాటి ఆధారంగా ఎంపిక జాబితాను సిద్ధం చేస్తారు. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు కేటాయించిన రోజు రాకుంటే ఉద్యోగం రానట్టేనని అధికారులు తేల్చారు.  

నాలుగు రోజుల ప్రక్రియ 

గ్రూప్‌-1 ఫలితాలపై ఉన్న వివిధ కేసులు కోర్టుల్లో కొట్టివేయడంతో ఎంపిక ప్రక్రియను టీజీపీఎస్సీ చేపట్టింది. ఫలితాలు ఆధారంగా ఎంపిక జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేసినప్పటికీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు మాత్రం ఒక పోస్టుకు ఒకరినే పిలిచారు. దీనికి సంబంధించిన జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టారు అధికారులు. ఇందులో పేర్లు ఉన్న వారంతా కూడా ఈనెల 16 నుంచి పబ్లిక్ గార్డెన్‌లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్శిటీ క్యాంపస్‌కు రావాల్సి ఉంటుంది. అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. 16 నుంచి నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ పేరకొన్నారు.  

అభ్యర్థులు ఏం తీసుకురావాలి?

సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది.  ఎప్పుడు ఎవరు రావాలో కూడా అందులో పేర్కొన్నారు. వచ్చే అభ్యర్థులు నోటిఫికేషన్‌లోని అనెక్జర్‌-6 లో పేర్కొన్నట్టు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, సెల్ఫ్‌ డిక్లరేషన్ ఫామ్‌తోపా రెండు సెట్ల జిరాక్స్‌లు తీసుకురావాల్సి ఉంటుంది. పదిహేనో తేదీ నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపిక కూడా కల్పిస్తారు. 

మరో ఛాన్స్ లేదంటున్న అధికారులు

చెప్పిన తేదీకి అభ్యర్థి రాకపోయినా అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు లేకపోయినా మరో ఛాన్స్ లేదంటున్నారు అధికారులు. అందుకే ఇంకా ఆరు రోజులు టైం ఉన్నందున కచ్చితంగా అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ జాబితాలో ఉన్న అభ్యర్థి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాకపోయినా, ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించకపోయినా తర్వాత అభ్యర్థికి అవకాశం ఇస్తారు. అంతే కానీ మరో అవకాశం ఇవ్వడం ఉండదని చెబుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచిస్తున్నారు. 

ఈ మధ్య జీవో నెం.29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వాటిని కొట్టేసింది. దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణలు చేసి జీవో 29ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దీన్ని రద్దు చేయాలని కొరుతూ కొందరు గ్రూప్ 1 అబ్యరర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను కొర్టు కొట్టివేయంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం టీజీపీఎస్సీ షెడ్యూలు రిలీజ్ చేసింది. 

563 గ్రూప్-1 పోస్టులను భర్తీ కోసం గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించింది. మార్చి 30న జనరల్‌ లిస్ట్ రిలీజ్ చేసింది. మార్చి 24 వరకు రీకౌంటింగ్ దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. దీని కోసం దరఖాస్తు చేసుకున్న 21,085 మంది మార్కులను కూడా వెల్లడించింది. అన్ని ప్రక్రియలు పూర్తి మరో అడుగు ముందుకేసింది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ పూర్తి అయితే నియామకపత్రాలు అందజేయనుంది.