ED, IT Entered to HMDA ex Director SivaBalakrishna case: హెచ్‌ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్‌ పెట్టాయి. ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నాయి. మనీలాండరింగ్‌  నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ చేపట్టనుంది. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్‌తోపాటు ఇతర పత్రాల కాపీలన్నీ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)కి లేఖ పంపింది ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)  వర్గాలు. ఏసీబీ నుంచి ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు కాపీలు అందిన వెంటనే... ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది. మరోవైపు.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐటీ) కూడా ఈ కేసులో ఇన్వాల్వ్‌ అవుతోంది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం  కింద శివబాలకృష్ణ బినామీలపై విచారణ జరపనుంది ఆదాయపు పన్ను శాఖ. 


అధికారాన్ని ఉపయోగించుకుని హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఆయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1000 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఆదాయానికి మించిన ఆస్తుల  కేసులో శివబాలకృష్ణపై ఏసీబీ (ACB) దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్ వాల్యు ప్రకారం రూ.250 కోట్ల ఆస్తులను బాలకృష్ణ అక్రమంగా ఆర్జించినట్టు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో ఆ ఆస్తుల విలువ నాలుగు రెట్లు అధికంగా ఉండే  అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ కేసులో శివబాలకృష్ణతోపాటు ఆయన సోదరుడు నవీన్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.


బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో... ఇప్పటివరకు 214 ఎకరాల పొలం, 29 ప్లాట్లు, ఏడు ఫ్లాట్లు, ఒక విల్లా, 5.5 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. ఇవన్నీ కలిసి మార్కెట్‌ విలువ ప్రకారం 250 కోట్లు  ఉంటాయని ఏసీబీ అంచనా వేసింది. ఈ కేసులో... బాలకృష్ణ సోదరుడు శివ నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలను గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై  కూడా ఆరా తీస్తున్నామని అన్నారు. బ్యాంకు లాకర్లలో 18 తులాల బంగారం, పాస్ బుక్‌లను కూడా గుర్తించారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన పెట్టుబడులపై కూడా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు.


శివబాలకృష్ణను 8రోజులపాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు పలు విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. అక్రమాస్తులు, బినామీలపై అరా తీసింది. శివ బాలకృష్ణ మేనల్లుడు భరత్‌ను కూడా బినామీగా గుర్తించింది ఏసీబీ.  సోదరుడు నవీన్‌ మాత్రమే కాకుండా... మరో సోదరుడు శివ సునీల్, మేనల్లుడు భరత్‌ పేరుపై కూడా భారీగా ఆస్తులు గుర్తించారు. బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ఆదిత్య, ఫీనిక్స్ ప్రతినిధులను సైతం ఏసీబీ అధికారులు  ప్రశ్నించారు. ఆ రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వాటాలు తీసుకునున్నట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు బయటకు తీసే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు... ఔటర్  రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట,నల్గొండ, మహబూబ్ నగర్, జనగామ, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో 120 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా... ఏసీబీ విచారణలో లెక్కకు మించి శివ బాలకృష్ణ ఆస్తులు బయట  పడుతుండటంతో మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది ఏసీబీ. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ కూడా ఈ కేసులో ఎంటర్‌ అయితే... దర్యాప్తు మరింత లోతుగా జరగుతుంది.