CMRF Checks Scam In Telangana: తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతోంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్ జరిగిందని కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు. వారిలో హరీష్‌రావు పీఏ నరేష్‌ ఉన్నాడు. 


జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కార్యాలయం స్పందించింది. "హరీష్‌ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేసిండు అనే వార్తతో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పని చేసే వారు. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తైన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, ఆ ఆఫీస్‌ను తర్వాత రోజు 06-12-2023 రోజున మూసివేసి, సిబ్బందిని పంపేశాం. ఆ రోజు నుంచి నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. 


అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే మా కార్యాలయం స్పందించి, నరేష్ అనే వ్యక్తిపై 17-12-2023 నాడు, నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. చట్ట ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని కోరాం. కాబట్టి, ఆ వ్యక్తితో హరీశ్ రావుకి గానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదు. 


ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మా కార్యాలయం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండా, ఎన్నో విధాలుగా సహాయంపడింది. ఈ విషయం అందరికి తెలిసిందే. వాస్తవాలు గుర్తించాలని కోరుతున్నాం." అంటూ ప్రకటన రిలీజ్ చేశారు.