SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు నో ఎంట్రీ- హరీష్ టీంను అడ్డుకోవడంతో హైడ్రామా
Telangana News: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరు చూస్తామన్న బీఆర్ఎస్ నేతల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Harish Rao Latest News : ఎస్ఎల్బిసి టన్నెల్ ఓవైపు సహాయక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరోవైపు ఉద్రిక్తత కూడా నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తామని హరీష్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం టన్నెల్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేసింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడ్డుకున్న చోటే హరీష్రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
పోలీసులు అడ్డుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన హరీష్రావు ఇతర బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు చేస్తోందని వాటికి ఆటంకం లేకుండా కొద్ది రోజులు ఆగిన తర్వాత వెళ్లాలని కేసీఆర్ సూచించారు. ప్రమాదం జరిగి దాదాపు ఐదు రోజులు అవుతున్నందున సహాయక చర్యలు పరిశీలించేందుకు వచ్చామని కానీ పోలీసులు అడ్డుకోవడం ఏంటని హరీష్ ప్రశ్నించారు.
హరీష్ ఇంకా ఏమన్నారంటే"ఇప్పటి దాకా సంయమనం పాటించాం. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఆరు రోజుల్లో 8 మంది ప్రాణాలు కాపాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది సున్నా పని. అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునేందుకు వచ్చాం. బాధిత కుటుంబాలను పరామర్శించటానికి వచ్చాము. అయినా మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజా ప్రతినిధులమని చూడకుండా ఆపారు. అయినా మేము, మా సభ్యులు పోలీసులకు సహకరించాం. అని హరీష్ రావు ఫైర్ అయ్యారు.
"వివిధ బృందాల మధ్య సమన్వయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎవరు ఏం పని చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంలో డైరెక్షన్ లేకుండా ఉన్నారు. ఆరు రోజుల వరకు డైరక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉండడం ఏమిటి?. లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైపోవాలి. ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా?. మంత్రులు పొద్దున వస్తున్నారు సాయంత్రం పోతున్నారు ఇదేమైనా టూరిస్ట్ ప్లేసా? హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతున్నారు. హెలికాప్టర్లు వేసుకొని ఎన్నికల ప్రచారం పోతున్నారు. అని హరీష్ మండిపడ్డారు.
"సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు రారు, డైరక్షన్ లేదు. మంత్రి రోజు పొద్దున వస్తుండు, సాయంత్రం పోతున్నాడు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో. డైరెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇవ్వాలా అరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్టు పనిచేయడం లేదు. దాన్ని రిపేర్ చేయడానికి ఆరు రోజులు పడుతుందా. గంటల్లో పూర్తి చేసే పని. కన్వేయర్ బెల్టు పని చేస్తే లోపల ఉన్న శిథిలాలు వంటివి బయటకు తీసుకురావడానికి సాధ్యమైతది." అని హరీష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"టన్నెల్ బోర్ మెషిన్ పార్ట్స్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నారు. అవి కట్ చేసి, తీసుకురావాలా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు సమయం తీసుకున్నారు. ఆ నాలుగు రోజులు లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి" అని హరీష్ ప్రశ్నించారు.
"అది కట్ చేయాలనీ తొందరగా నిర్ణయం తీసుకొని, ఫాస్ట్గా డీ వాటరింగ్ చేసి, కన్వేయర్ బెల్ట్ ఓకే చేసి దాని ద్వారా అడ్డంకిగా ఉన్నవి బయటికి తేవాల్సి ఉండే. ఆరు రోజుల తర్వాత తట్టెడు మట్టి తెచ్చారు. 8 మంది ప్రాణాలు కాపాడటం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా. సహాయక బృందాలు, కంపెనీ వారు, లేబరు, అధికారులు అందరితో మాట్లాడడం. కన్వేయర్ బెల్టు ఎప్పటి వరకు అవుతుంది అని అడిగితే.. రెండు రోజులను ఒకరంటారు, ఉత్తమ్ రెండు రోజుల్లో మొత్తం ఆపరేషన్ అయిపోతుందంటారు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు
Also Read: ఎస్ఎల్బీసీ టెన్నెల్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్- సొరంగంలో చొరబడిన రాజకీయం
"ఆరు రోజులైనా కన్వీయర్ బెల్ట్ ఇప్పటికీ ఉపయోగంలోకి రాదు, బురద, డెబ్రిస్ని బయటికి తీసుకురారు. ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు. టన్నెల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులు టన్నెల్లోకి పోయినప్పుడు.. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశాము మాకు అనుమతి లేదా? బాధ్యతగల మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తే అడ్డుకుంటారా? ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అని హరీష్ ఆరోపించారు.
బాధ్యతతో తాము సమయమనంతో ఉంటే రెస్క్యూ కొనసాగాలే ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటే కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. "గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టన్నెల్ కూలిందని ఉత్తంకుమార్ రెడ్డి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి సిగ్గుండాలి. గత ప్రభుత్వానికి ఇప్పటి ఘటనలు ఏం సంబంధం. పని ప్రారంభించేటప్పుడు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిందా ఇస్తే అది బయట పెట్టండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్ పిలిచి వాళ్ళ ఒపినియన్ తీసుకున్నారా. ఉంటే ఆ రిపోర్టు బయట పెట్టండి. ఆదరా బాదరా ఆగమాగం చేసి ప్రాణాలు బలిగొన్నరు ప్రాజెక్టు కుప్పకూలిపోయే పరిస్థితి గత ప్రభుత్వం పనే చేయలేదని ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. చదువుకున్న వారు విజ్ఞానవంతులు మంత్రిగా ఉన్నారు రికార్డులు చూసుకోండి. 9 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎస్బీసీ లో 3300 కోట్ల రూపాయల పని జరిగితే... 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 3900 కోట్ల రూపాయల పని ఈ ప్రాజెక్టులో జరిగింది." అని గుర్తు చేశారు.
"రెండేళ్లు వరుసగా కరోనా వచ్చినా 10,000 లీటర్ల సీపేజి వచ్చినా ఇబ్బందులు వచ్చినా దాదాపు 12 కిలోమీటర్ల టనల్ పూర్తి చేసాము. దిండి రిజర్వాయర్ను, పెళ్లిపాక రిజర్వాయర్ను ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వాటికి భూసేకరణ పూర్తి చేసి ఆ ప్రాజెక్టును 90% పూర్తి చేసాము. కానీ మైకుల ముందు నోటికి వచ్చినట్టు గత ప్రభుత్వం పని చేయలేదని మాట్లాడుతాడు. మంత్రి జూపల్లి 5 కిలోమీటర్లు మాత్రమే పనిచేసిన అంటడు. మా ప్రభుత్వంలో నేను నీళ్ల మంత్రిగా ఉన్నప్పుడు నాతోపాటు సహచర మంత్రిగా ఇదే టన్నెల్కు నాతో వచ్చిండు. పార్టీ మారగానే ప్లేట్ ఫిరాయించి నాలుక మడత పెడుతున్నాడు. దివాలాకోరు దిగజారుడు రాజకీయాలు చేయకండి. అని హరీష్ రిక్వస్ట్ చేశారు.
ఇప్పటికైనా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని బృందాల మధ్య సమన్వయం తీసుకురావాలని హరీష్ సూచించారు. నిపుణుల సలహాలు తీసుకోండి వేగవంతంగా చేయండన్నారు. ఆరు రోజులు అంటే ఎంత అమూల్యమైనవి అని అన్నారు. మంచినీళ్లు లేకుండా ఆహారం అందకుండా ఆక్సిజన్ లేకుండా వారి ప్రాణాలు ఏం కావాలని ప్రశ్నించారు. ఆ దారుణమైన పరిస్థితిలో ఉన్న వారి స్థానంలో ఉండి ప్రభుత్వం ఆలోచించాలన్నారు.
కూలిపోతున్న ప్రాజెక్టులను కాపాడలేకపోతున్న ప్రభుత్వం ఉన్న నీళ్లను కూడా నిలబెట్టుకోలేకపోతోందని దుయ్యబట్టారు. "శ్రీశైలం మొత్తం ఖాళీగా కనిపిస్తున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తాగునీరు దీనిపైన ఆధారపడి ఉంటుంది. మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతుంటే ప్రభుత్వం నిద్రపోతుందా? ముచ్చుమరి నుంచి పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు. ఆపే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ? సాగర్ లోనూ నీళ్లు లేని పరిస్థితి. ఆరున్నర లక్షల ఎకరాల సాగరాయకట్టు ఉంది. " అని అన్నారు.
"ఆంధ్ర ప్రభుత్వం కృష్ణ నీళ్లు తరలిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు. కె ఆర్ ఎం బి కి ఫిర్యాదు చేసి ఎందుకు అడ్డుకోవడం లేదు. టిఆర్ఎస్ పార్టీ ముళ్ళు కర్ర పట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలడం లేదు. మొదటి KRMB మీటింగ్ లోనే ఒప్పుకొని వచ్చారు. సెక్షన్ 3 కింద నీటి పంపకాలు అయ్యేవరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదు అని కేసిఆర్ గర్జించారు. మీరు నిర్ణయాన్ని వాపస్ తీసుకుంటున్నామని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. చంద్రబాబు గోదావరి నీళ్లను బనకచర్ల లింకు ద్వారా ఆంధ్రకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టీ ప్రశ్నిస్తే, నిలదీస్తే అప్పుడు మూడg రోజుల కింద బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రాసిండు. రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవు, కుర్చీల కొట్లాట మీ మధ్య ఉంది. మొన్న కృష్ణా జలాలు కుడి కాల్వ ద్వారా రోజు 10 వేల క్యూసెక్కులు తరలిస్తున్నారని నేను మాట్లాడితే అప్పుడు KRMB ఛైర్మెన్ వద్దకు వెళ్లిండు. రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. అని హరీష్ ఆరోపించారు.
Also Read: డేటా సెంటర్లతో నీటి, విద్యుత్ కొరత- బిగ్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చిన కేటీఆర్