ఉచిత విద్యుత్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలక గడవక ముందే టీఆర్‌ఎస్‌ యుద్ధం ప్రకటించేసింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలకు పిలుపునిచ్చింది. 


రేవంత్ చేసిన కామెంట్స్‌ను ట్విటర్ వేదికగా మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానాలకు అద్దం పట్టిందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపునిస్తుందని తెలిపారు. 


తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ  ప్రకటించిన వేళ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు నిచ్చారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని విమర్శించారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని హితువు పలికారు. 






రేవంత్ ఏమన్నారంటే
తెలంగాణలో ఉన్న 95 శాతం మంది రైతులు 3 ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే అన్నారు. ఒక ఎకరానికి నీరు పారించాలంటే ఓ గంట చాలని... మూడు ఎకరాలకు ఫుల్‌గా నీళ్లు పారించాలంటే మూడు గంటలు చాలని అభిప్రాయపడ్డారు. టోటల్‌గా 8 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందని వివరించారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమీషన్లు తీసుకునేందు వ్యవసాయానికి 24 గంటలక కరెంటు స్లోగన్స్ తీసుకొచ్చారని ఆరోపించారు. దీంతో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచితాన్ని అనుచితంగా భావించి స్వార్థానికి వాడుకోకూడదని సూచించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ కాకకు కారణమయ్యాయి. 










క్లారిటీ ఇవ్వండి 


దీనిపై ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... రేవంత్‌ ఏ సందర్భంలో ఆ కామెంట్స్ చేశారో చెప్పాలన్నారు. అయితే మేనిఫెస్టులో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది అధినాయకత్వం నిర్ణయమని తానో, రేవంతో చెప్పినంత మాత్రాన అవి జరిగిపోవని అన్నారు. అందుకే రేవంత్ వ్యాఖ్యలను వ్యక్తిగతంగానే చూడాలి తప్ప పార్టీకి ఆపాదించొద్దని పేర్కొన్నారు. ఇప్పుడు దిష్టిబొమ్మలు దహనం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు.






గతంలో కూడా కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇస్తామంటే చాలా మంది వ్యతిరేకించారని కానీ పట్టువదలకుండా రాజశేఖర్‌ రెడ్డి దాన్ని నిజం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అలానే జరుగుతుందన్నారు. మేనిఫెస్టోలో ఇంకాా చాలా అంశాలు ఉంటాయని వాటిని చూస్తే ప్రత్యర్థులకు వణుకుపుడుతుందన్నారు. ప్రజలు తిరస్కరిస్తున్నారన్న బాధలో బీఆర్‌ఎస్‌ ఇలాంటి వాటితో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు.