Bidar robbers opened fire on the police in Hyderabad Afzal Ganj : హైదరాబాద్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఏరియా ఆఫ్జల్ గంజ్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న సమయంలో ఒక్క సారిగా కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. కొంత మంది .. ఇతరుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం .. వారు వెళ్లి ఓ ట్రావెల్స్ ఆఫీసులో దాక్కోవడం వంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. అచ్చం సినిమా సీన్లా జరిగిపోవడంతో ప్రజలు అవాక్కయ్యారు.
కాల్పులు జరిపినది.. బీదర్ కు చెందిన ఏటీఎం దొంగల ముఠాగా గుర్తించారు. వారిని పట్టుకునేందుకు బీదర్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారు హైదరాబాద్ లో షెల్టర్ తీసుకున్నట్లుగా సమాచారం రావడంతో బీదర్ నుంచి పోలీసులు వచ్చారు. ఆఫ్జల్ గంజ్ లో వారున్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టారు. అయితే బీదర్ పోలీసుల్ని గుర్తు పట్టిన దొంగలు.. వారిపై కాల్పులు జరిపారు. పక్కనే ఉన్న ట్రావెల్స్ ఆఫీసులోకి దూరారు. బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
బీదర్లో గురువారం ఉదయమే ఈ ముఠా దోపిడీ చేసింది. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఓ ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టడానికి వచ్చిన వాహన సిబ్బందిపై బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తర్వాత, దొంగలు రూ.93 లక్షల నగదుతో పారిపోయారు. ఈ సంఘటన జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దగ్గరలో చోటుచేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఆధారాల ద్వారా నిందితులను గుర్తించారు.
అక్కడ దోపిడీ చేసిన డబ్బులతో వారు పారిపోయి హైదరాబాద్ వచ్చినట్లుగా గుర్తించారు. వారిని వెంబడిస్తూ బీదర్ పోలీసులు కూడా వచ్చారు. తమ ఉనికి తెలియదని అనుకున్న ఆ దొంగలు.. బీదర్ పోలీసులు తమ వెంట రావడంతో పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆఫ్జల్ గంజ్ కాల్పులు చోటు చేసుకున్నాయి. వారు ఎక్కడికీ తప్పిపంచుకుపోకుండా హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకుంటున్నారు.
కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఈ బీదర్ దోపిడీలో నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Maha Kumbh 2025: అడ్డమైన ప్రశ్న అడిగాడని యూట్యూబర్ను చితబాదిన బాబా - మహాకుంభమేళాలో వైరల్ వీడియో