FIR Against HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు అయింది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా ఈనెల 25వ తేదీన టీ-ట్వంటీ మ్యాచ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మ్యాచ్ కు సంబంధింటిన టికెట్లపై తప్పుడు సమయం ముద్రించారని ఓ యువకుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టికెట్లపై సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుందని ముద్రించారని, కానీ ఆట మాత్రం 7 గంటలకే ప్రారంభం అయిందని చెప్పాడు. యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెచ్సీఏపై ఇప్పటికే మూడు కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. 


మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు..


భారత్-ఆస్ట్రేలియా టీ20 టికెట్ల వివాదం మరింత ముదిరింది. టికెట్లను బ్లాక్ లో అధిక రేట్లకు అమ్ముకున్నారని ఇప్పటికే హెచ్సీఏపై మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది. అలాగే జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాటకు హెచ్సీఏ నిర్వహణ లోపమే కారణమని మరో ఫిర్యాదు నమోదు అయింది. హెచ్సీఏ, అజారుద్దీన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. 


హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. వెంటనే అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని హెచ్ఆర్సీని కోరారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జ్ కి కారకులైన అజారుద్దీన్ తో పాటు HCA  నిర్వాకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం HCA తో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు.  ఉప్పల్ లో జరగబోయే ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో HCA పూర్తి వైఫల్యం చెందిందని ఆరోపించారు. 


ఇప్పటికే మూడు కేసులు నమోదు..


ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తోపాటు మ్యాచ్ నిర్వాహకులపై  పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకున్న ఆధారాలతో హైదరాబాద్‌ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ అదితి ఆలియా, ఎస్‌ఐ ప్రమోద్‌ ఫిర్యాదులతో కేసులు పెట్టారు. ప్రధానంగా హెచ్‌సీఏపై టికెట్‌ నిర్వాహణ, బ్లాక్‌లో విక్రయించారన్న ఆరోపణలపై సెక్షన్ 420, సెక్షన్ 21, సెక్షన్ 22/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమేనని గాయపడిన వారితో పాటు పోలీసులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే గాయపడ్డ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.