Bandi Bhageerath Case Latest News | హైదరాబాద్: బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసులో పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు ముమ్మరం చేసిన కొద్దీ ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు నిందితుడు బండి భగీరథ్‌పై మరింత కఠినమైన బీఎన్ఎస్ సెక్షన్‌ను జోడించారు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఉండటంతో పోలీసులు ఈ కొత్త సెక్షన్‌ను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 64(2)(m) సెక్షన్‌ను అదనంగా చేర్చారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఈ సెక్షన్‌ను జోడించడంతో నిందితుడికి చట్టపరంగా ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త కేసు ప్రకారం తప్పు చేసినట్లు రుజువైతే భగీరథ్‌కు 10 ఏళ్ల వరకు జైలుశిక్ష పడుతుందని తెలుస్తోంది. బాధితురాలి నుంచి సేకరించిన మరికొన్ని వివరాలు, సాంకేతిక ఆధారాల ప్రకారమే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.

మరోవైపు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న బండి సాయి భగీరథ్‌ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. జైలు నిబంధనల ప్రకారం నేడు వారు చర్లపల్లి జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా భగీరథ్‌ను కలవనున్నారు. కఠినమైన సెక్షన్లు తోడవడంతో తదుపరి లీగల్ ప్రాసెస్, బెయిల్ పిటిషన్లపై ఈ ములాఖత్‌లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చర్చించే అవకాశం ఉంది.

Continues below advertisement

Also Read: Bandi Bhagirath: భగీరథ్ కేసులో రాజకీయం వర్సెస్ చట్టం - మైలేజ్‌ కోసం బీఆర్ఎస్ ప్రయత్నం - కాంగ్రెస్, బీజేపీ తిప్పికొట్టగలవా?

బండి భగీరథ్‌కు మద్దతుగా వీడియోలు.. 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు

బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా నిందితుడికి మద్దతుగా విపరీతంగా ప్రచారం నిర్వహిస్తూ, అతడు నిర్దోషి అని చిత్రీకరించే ప్రయత్నం చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో మొత్తం 27 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఫిర్యాదులు రాగా, ప్రాథమిక విచారణ అనంతరం అందులో 14 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మిగిలిన వారిపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో ఇన్‌ఫ్లూయెన్సర్లు జోక్యం చేసుకుని.. మైనర్ బాలిక వివరాలు వెల్లడించడం, ఆమె ఫొటోలు పబ్లిష్ చేసి తప్పిదాలు చేశారు. బండి భగీరథ్‌ను సమర్థిస్తూ వీడియోలు, పోస్ట్‌లు, ఫోటోలు పెట్టడానికి వీరంతా భారీగా డబ్బులు తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడు ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే అతడిని ఇరికించారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వీరంతా కావాలనే కుట్రపూరితంగా ఈ కంటెంట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారని బాధితుల తరపున ఫిర్యాదులు అందాయి.

పోక్సో చట్టం కింద తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అనుకూలంగా సోషల్ మీడియా రూల్స్‌ను అతిక్రమించి మరీ పెయిడ్ ప్రమోషన్లు చేయడం చట్టరీత్యా నేరం. అంతేకాకుండా, నిందితుడిని వెనకేసుకొచ్చే క్రమంలో ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు పరోక్షంగా బాధితుల వివరాలను, వారి గుర్తింపును బయటపెట్టినట్లు సమాచారం. చట్టప్రకారం పోక్సో కేసుల్లో బాధితుల వివరాలను వెల్లడించడం తీవ్రమైన నేరం కావడంతో, నిబంధనలను ఉల్లంఘించిన ఈ 14 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.