గణేష్ ఉత్సవాల్లో ఎంతో ఆసక్తి నెలకొనే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రక్రియ ముగిసింది. లడ్డూను ఏకంగా 24 లక్షల 60 వేలు చెల్లించి వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. లడ్డూ వేలం జరగడం వరుసగా ఇది 29వ ఏడాది. ఈయన గత 29 ఏళ్లుగా వేలం ప్రక్రియలో పాల్గొంటున్నట్లుగా నిర్వహకులు తెలిపారు.


బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో 9 మంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకునేందుకు ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పోటీ పడ్డారు. వీరిలో జక్కిడి శివచరణ్ రెడ్డి, దాసరి దయానంద్ రెడ్డి, ఎర్ర జయిం, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కొణతం ప్రకాశ్ రెడ్డి, నవారి శ్రీనివాస్ రెడ్డి, వొంగేటి లక్ష్మారెడ్డి, కొలను శంకర్ రెడ్డి తదితరులు వేలం పాటలో పాల్గొన్నారు. 


తొలుత నిర్వహకులు లడ్డూ ధరను 5 లక్షల నుంచి ప్రారంభించారు. బాలాపూర్ లడ్డూ ధరను వేలం పోటీలో పాల్గొన్న వారు అమాంతం పెంచుకుంటూ పోయారు. కొద్ది క్షణాల్లోనే వేలంలో లడ్డూ ధర 20 లక్షలు దాటేసింది. మొత్తానికి 24 లక్షల 60 వేలకు వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు.