కరోనాకు ముందు ప్రతి రోజూ రూ.13 కోట్లుగా ఉన్న టీఎస్ ఆర్టీసీ సంస్థ ఆదాయం కరోనా వైరస్ రాకతో రూ.3 కోట్లకు పడిపోయిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ఆదాయం ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోందని, ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. టీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌‌గా బాజిరెడ్డి గోవర్థన్ హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. నష్టాలు వస్తున్నాయని టీఎస్ ఆర్టీసీ ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామని వెల్లడించారు. 


ప్రజల మనోభావాలను దెబ్బతీయబోని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. ఆసియాలోనే నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ఆర్టీసీ సంస్థ నష్టాల బారిన ఎందుకు పడిందో అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. కష్టపడే తత్వం ఉన్న సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారని, ఆయన ఆధ్వర్యంలో సంస్థను లాభాల బాట పట్టిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ ఆదాయాన్ని తిరిగి రూ.13 నుంచి 14 కోట్లకు చేరుస్తామని భరోసా ఇచ్చారు.


95 శాతం బస్సులు రంగంలోకి..
అనంతరం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా విలేకరులతో మాట్లాడారు. కరోనా తర్వాత 95 శాతం బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. ఆర్టీసీకి ప్రజల ఆదరణ చాలా అవసరమని తెలిపారు. పట్టణాలతో సహా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను పున:ప్రారంభిస్తామని వివరించారు. వంద శాతం సురక్షిత ప్రయాణంతో బస్సులను నడుపుతున్నట్లుగా సజ్జనార్ వెల్లడించారు.


కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ హాజరై బాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యలు స్వీకరించిన బాజిరెడ్డికి అభినందలు తెలిపారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్థన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. సామాన్యుడి ప్రయాణ రథం అయిన ఆర్టీసీ బస్సు ప్రగతి పథంలో ముందుకు సాగాలని అన్నారు.