హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజహరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కోట్ల రూపాయల నిధులను అజాహరుద్దీన్ అండ్ కో పక్కదారి పట్టించిందని, టెండర్ల పేరుతో థర్డ్ పార్టీ కి నిధులు కట్టబెట్టిందని హెచ్‌సీఏ నిధులపై ఆడిట్ నిర్వహించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ నిర్ధారించింది.


ముఖ్యంగా క్రికెట్ బాల్స్ కొనుగోలు లో భారీ గోల్‌మాల్‌ జరిగిందని కమిటీ నిగ్గుతేల్చింది. ఒక్కో బాల్ ను 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ ఇచ్చారని, ఇలా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు నష్టం కలిగించారని కమిటీ తెలిపింది. అలాగే బకెట్ చైర్స్ కొనుగోలు పేరుతో జరిగిన గొల్‌మాల్‌లో హెచ్‌సీఏకు 43 లక్షలు నష్టం జరిగిందని కనుగొన్నారు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో 1.50 కోట్లు హెచ్‌సీఏకు నష్టం వాటిలినట్టుగా కమిటీ అభిప్రాయపడింది. జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు నష్టం.. ఇలా కోట్లాది రూపాయల హెచ్‌సీఏ నిధులను దోచుకున్నారని కమిటీ రిపోర్ట్‌ ఇచ్చింది.


2019-2022 మధ్య హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్‌ ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్టు ప్రత్యేక విచారణ కమిటీ నిర్ధారించింది. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజారుద్దీన్‌ పై నాలుగు కేసులు నమోదు కాగా.. . ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉప్పల్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజారుద్దీన్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.


నాలుగు వేరు వేరు ఫిర్యాదులు


హెచ్‌సీఏ కు అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న మూడేళ్ల కాలంలో నిధుల దుర్వినియోగం పై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ ను గాడిలో పెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు సింగిల్ మెంబర్ కమిటీ ఫోరెన్సిక్ అడిట్ చేయగా... నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది. కమిటీ ఆదేశాల మేరకు హె చ్ సీఏ సీఈవో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు వేర్వేరు ఫిర్యాదులు చేశారు. అజారుద్దీన్, విజయానంద్, సురేందర్ తోపాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ 406,409,420,465,467,471, 20బీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు వెల్లడించారు.


హెచ్‎సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‎ దిగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం ప్రెసిడెంట్‎ పదవి నుంచి అజారుద్దీన్‎ను అపెక్స్ కౌన్సిల్‎ సస్పెండ్ చేసింది. 


ఫిబ్రవరి 26, 2020లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‎పై అపెక్స్ కౌన్సిల్ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‎సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాలతో హెచ్‎సీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు అజార్‎కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న తనకు నోటీసులు ఇవ్వడంపై మహమ్మద్ అజహరుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించి అపెక్స్ కౌన్సిల్‎పై మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్‌ సభ్యులకు నోటీసులు ఇచ్చే హక్కు లేదని చెప్పారు. కౌన్సిల్‌లో మెజారిటీ లేకుండా సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొందరు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 


లోధా సిఫార్సుల మేరకే గతంలో నోటిసులు ఇచ్చామని అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. కౌన్సిల్లో వర్గాలు ఉన్నాయని అజహరుద్దీన్ అనడం సరికాదని చెప్పింది. వీలైతే ఆయన కోర్టుకు వెళ్లి పోరాటం చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం ఉండదని తేల్చి చెప్పింది.